భార్యాభర్తలు కాబోతున్న చైతు శోభిత

గత కొంత కాలంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ ప్రేమలో ఉన్నట్టు వచ్చిన వార్తలకు ఎట్టకేలకు అధికారిక ముద్ర పడనుంది. ఇవాళ సాయంత్రం చైతు ఇంట్లో జరిగే నిశ్చితార్థం ద్వారా ఇద్దరి పరిణయానికి తొలి అడుగులు పడబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. అక్కినేని కుటుంబం ఇంకా అఫీషియల్ గా చెప్పనప్పటికీ ఒక్కసారిగా ఈ వార్త నిన్న రాత్రి నుంచే దావానలంలా సోషల్ మీడియాని కమ్మేసింది. ఇటు ఈ జంట కానీ నాగార్జున కానీ దీని గురించి స్పందించలేదు కానీ నేరుగా ఉంగరాలు మార్చుకునే ఫోటోలతోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని అంతర్గత సమాచారం.

2021లో సమంతాతో విడాకులు తీసుకున్న తర్వాత చైతు తన రెండో పెళ్లి దిశగా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. ఇంకోవైపు శోభితతో తన బంధానికి సంబంధించిన పలు ఫోటోలు, లీకులు బయటికి వచ్చినప్పటికీ స్పందించడానికి ఏనాడూ సిద్ధపడలేదు. గూఢచారి నుంచి తెలుగులో హిట్ ట్రాక్ లో పడ్డ శోభిత వరసగా సినిమాలు చేయకపోయినా వెబ్ సిరీస్, పొన్నియిన్ సెల్వన్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ద్వారా రెగ్యులర్ గా దర్శనమిస్తూనే ఉంది. కాకపోతే చైతు శోభిత కలిసి సినిమా చేయకపోవడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఏకంగా రియల్ లైఫ్ లో ఒక్కటి కాబోతున్నారు.

ప్రస్తుతం ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నట్టు వినికిడి. వివాహం ఈ ఏడాదే ఉండొచ్చని అంటున్నారు కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తండేల్ షూటింగ్ లో బిజీగా ఉన్న నాగ చైతన్య కొద్దిరోజుల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. బహుశా ఈ వేడుక గురించి ముందస్తుగా చేసుకున్న ప్లానింగ్ కావొచ్చు. మొత్తానికి చైతు బ్రహ్మచారి జీవితానికి ముగింపు పలికి కొత్త జీవిత భాగస్వామిని ఆహ్వానించబోతున్నాడు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్ టా తదితర సామాజిక మాధ్యమాల్లో అప్పుడే వెడ్డింగ్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇకపై శోభిత మిసెస్ అక్కినేని శోభిత అన్నమాట.