డబుల్ ఇస్మార్ట్ టీంలో టెన్షన్

పూరి జగన్నాథ్, రామ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం.. డబుల్ ఇస్మార్ట్. నాలుగేళ్ల కిందట బ్లాక్‌బస్టర్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మామూలుగా ఒక హిట్ మూవీ సీక్వెల్ వస్తుంటే.. మంచి బజ్ క్రియేట్ అవుతుంది. బిజినెస్‌కు ఢోకా ఉండదు. సక్సెస్ మీద కూడా టీం ధీమాగా ఉంటుంది. అలాగే థియేటర్ల సమస్యలు కూడా ఉండవు. కానీ ‘డబుల్ ఇస్మార్ట్’ విషయంలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

పూరి చివరి సినిమా ‘లైగర్’ డిజాస్టర్ కావడం ఆయన మీద విపరీతమైన ప్రెజర్ పెంచింది. ఆ సినిమా నష్టాలను సెటిల్ చేయాల్సిన స్థితిలో పూరి ‘డబుల్ ఇస్మార్ట్’ను మొదలుపెట్టారు. దీంతో కచ్చితంగా ఈ సినిమాను హిట్ చేసి తీరాలి. కానీ రిలీజ్ దగ్గర పడేకొద్దీ ఈ సినిమాను సమస్యలు చుట్టుముడుతున్నాయి.

ముందేమో ఆగస్టు 15 లాంటి క్రేజీ డేట్ దక్కిందని సంబరపడ్డారు. ఆ సీజన్లో రిలీజయ్యే పెద్ద సినిమా ఇదొకటే అనుకున్నారు. కానీ తమిళ అనువాద చిత్రం ‘తంగలాన్’ పోటీకి వచ్చింది. అయినా పర్లేదనుకున్నారు. కానీ ఈ మధ్యే ‘మిస్టర్ బచ్చన్’ కూడా రేసులోకి వచ్చింది. రవితేజ సినిమా అంటే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ అదే అవుతుంది. ‘తంగలాన్’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. మరోవైపు ‘ఆయ్’ అనే చిన్న సినిమా కూడా పోటీలో ఉంది. దాని కంటెంట్ మీద నిర్మాతలు ఎంతో ధీమాగా ఉన్నారు. కాబట్టి పోటీ పెద్ద సమస్యే. మరోవైపు ‘మార్ ముంత చోడ్ చింత’ పాటకు సంబంధించిన వివాదం వల్ల కొందరేమో ‘డబుల్ ఇస్మార్ట్’ను బహిష్కరిస్తామంటున్నారు.

ఈ సమస్య చాలదన్నట్లు ‘లైగర్’ నష్టాల సెటిల్మెంట్ జరక్కపోవడం, ఈ విషయంలో నిర్మాతల మండలి పూరికి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఎగ్జిబిటర్లు ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని అనధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ‘డబుల్ ఇస్మార్ట్’కు పెద్ద సమస్య వచ్చినట్లే. ఇన్ని తలనొప్పుల మధ్య సినిమా రిలీజై ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో, అంతిమంగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో అన్న టెన్షన్ నెలకొంది.