ప్రశాంత్ నీల్ వెనుక ఏం జరుగుతోంది

హఠాత్తుగా ఇవాళ ఉదయం నుంచి ప్రశాంత్ నీల్ తమిళ స్టార్ హీరో అజిత్ తో ఏకంగా రెండు సినిమాలు చేయబోతున్నట్టు వచ్చిన వార్త సోషల్ మీడియాని కుదిపేసింది. ఇది చెన్నై వర్గాల నుంచి వచ్చిన న్యూసే తప్ప ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. తలాకు రెండు కథలు చెప్పారని, సినిమాటిక్ యునివర్స్ తో ముడిపడేలా ఒకటి, ఇండివిడ్యూవల్ సబ్జెక్టుతో మరొకటి ఇలా రెండు చేసేందుకు అంగీకారం దొరికిందని వాటి సారాంశం. నిర్మాణ సంస్థ ఎవరు, ఇదంతా ఎప్పుడు జరిగింది లాంటి వివరాలు లేవు కానీ అజిత్ అభిమానులు మాత్రం ఈ వార్తని తెగ వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ప్రాక్టికల్ గా చూస్తే ప్రశాంత్ నీల్ చేతిలో చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి. సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం స్క్రిప్ట్ దాదాపు సిద్ధమైపోయింది. ప్రభాస్ డేట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాడు కానీ ఎప్పుడనేది ఇంకా తేలలేదు. ఇంకో వైపు జూనియర్ ఎన్టీఆర్ తో నీల్ ప్లాన్ చేసుకున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) తాలూకు పనులు కూడా తెరవెనుక జరిగిపోతున్నాయి. మైండ్ బ్లోయింగ్ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ మొత్తం సెట్ చేసి పెట్టారు. భవిష్యత్తులో కెజిఎఫ్ 3 ఉంటుందని యష్ తో పాటు నిర్మాత విజయ్ పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. అంటే దీని వర్క్ కూడా జరుగుతూ ఉండాలి.

ఇవి కాకుండా రామ్ చరణ్ తో నీల్ కాంబో కుదిరే సాధ్యాసాధ్యాలు లేకపోలేదు. మరి ఇంత టైట్ ప్లానింగ్ లో అసలు అజిత్ తో రెండు సినిమాలు ప్రశాంత్ నీల్ ఎలా చేస్తాడేది వేయి డాలర్ల ప్రశ్న. ఇది కేవలం గాసిప్పా లేక నిజంగానే చర్చలు జరిగాయా అనేది అతి త్వరలోనే తెలియనుంది. నేరుగా అడుగుదామంటే నీల్ బయట ఎక్కడా దొరకడం లేదు. ఈవెంట్లకు సైతం హాజరు కావడం లేదు. తారక్, ప్రభాస్ చేరి రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ప్రశాంత్ నీల్ టెంపొరరీగా వేరే ఆప్షన్లు చూస్తున్నారా లేక తెరవెనుక మతలబు ఏదైనా ఉందా అనేది వేచి చూస్తే తెలుస్తుంది.