ఇస్మార్ట్ చుట్టూ డబుల్ వలయం

వచ్చే నెల ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న డబుల్ ఇస్మార్ట్ చుట్టూ పెద్ద వలయమే ఏర్పడుతోంది. పోటీపరంగా ఎదురవుతున్న సవాళ్లు కఠిన పరీక్ష పెట్టేలా ఉన్నాయి. ఆగస్ట్ 15 రావాలని తంగలాన్ నిర్ణయించుకోవడంతో ప్యాన్ ఇండియాలో మంచి రిలీజ్ దక్కించుకోవాలని చూస్తున్న పూరి బృందానికి తమిళనాడు, కేరళలో చిక్కొచ్చేలా ఉంది. ఇక్కడేమో ఆయ్, 35 చిన్న కథ కాదు లాంటి చిన్న సినిమాలు సైతం బరిలో నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేవు. వీటి వెనుక గీతా ఆర్ట్స్, సురేష్, ఏషియన్ లాంటి పెద్ద సంస్థల అండదండలు ఉండటం ప్రధాన కారణం.

రవితేజ మిస్టర్ బచ్చన్ ప్రకటన కూడా ఏ నిమిషమైనా వచ్చేలా ఉంది. ఇంకా పాట షూటింగ్ జరుగుతున్నా ఓటిటి ఒప్పందం ప్రకారం ఆగస్ట్ 14 లేదా 15 థియేటర్ రిలీజ్ చేయాలనే ఒత్తిడిలో పీపుల్స్ మీడియా ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. ఇక బాలీవుడ్ లో శ్రద్ధ కపూర్ స్త్రీ 2 మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. ఇది నార్త్ మార్కెట్ లో ఖచ్చితంగా డబుల్ ఇస్మార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కాకుండా అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహం వేదాలు సైతం బరిలో దిగుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఇంటా బయట ఇంత పోటీ ఉండటం అందరి ఓపెనింగ్స్ మీద పరస్పరం ఎఫెక్ట్ ఉంటుంది.

ఇదంతా ఛేదించుకోవాలంటే డబుల్ ఇస్మార్ట్ సూపర్ బ్లాక్ బస్టర్ అనిపించుకోవాల్సిందే. రామ్, పూరి జగన్నాధ్ ఇద్దరూ వెనుక సినిమాలతో సక్సెస్ లో లేకపోయినా ఇస్మార్ట్ శంకర్ కున్న బ్రాండ్ భారీ బిజినెస్ తీసుకొచ్చింది. అరవై కోట్ల దాకా థియేటర్ హక్కులు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ లో టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఎక్స్ ట్రాడినరి రిపోర్ట్స్ రావాల్సిందే. రెండు పాటలు అంచనాలు పెంచడానికి ఉపయోగపడ్డాయి. ట్రైలర్ కట్ ని జాగ్రత్తగా చేయిస్తున్నారట. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన డబుల్ ఇస్మార్ట్ కు మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఊర మాస్ పాటలు ప్రధాన ఆకర్షణ కాబోతున్నాయి.