నాగ్ అశ్విన్ ఉద్దేశాన్ని అపార్థం చేసుకున్నారా

కల్కి 2898 ఏడి దర్శకుడు నాగ్ అశ్విన్ తన సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ చేరుకున్న సందర్భంగా పెట్టిన ఇన్స్ టా పోస్ట్ సోషల్ మీడియాలో మినీ దుమారం రేపింది. రక్తపాతం, హింస లాంటి మితిమీరిన అంశాలు లేకుండా తన మూవీ ఈ మైలురాయి అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నానని పేర్కొనడంతో అది యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాని ఉద్దేశించేనని కొందరు భాష్యం అందుకోవడంతో అది కాస్తా నిమిషాల్లో వైరలయిపోయింది. నిజానికి నాగ్ అశ్విన్ అక్కడ ఎవరి పేరుని ప్రస్తావించలేదు. కేవలం క్లీన్ ఎంటర్ టైనర్ అనే ఉద్దేశంలో పోస్ట్ చేసింది తప్ప మరొకటి కాదని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయం.

ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయం మరొకటి ఉంది. వయొలెన్స్, అగ్రెసివ్ హీరోయిజంని చూపించింది యానిమల్ ఒక్కటే కాదు. ఆ మాటకొస్తే జవాన్, పఠాన్ లాంటి వాటిలోనూ బోలెడు హింస ఉంటుంది. ఎప్పుడో వచ్చిన ఆషిక్ బనాయా ఆప్నేతో మొదలుకుని వచ్చే వారం రాబోతున్న గుడ్ న్యూజ్ దాకా చిత్ర విచిత్ర కాన్సెప్ట్ లతో బాలీవుడ్ దర్శకులు అడల్ట్ కంటెంట్ ని క్రమం తప్పకుండా పై స్థాయిని తీసుకు వెళ్తూనే ఉన్నారు. ఆ మాటకొస్తే మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్ కన్నా పచ్చి బూతుల సిరీస్ మరొకటి ఉండదు. ఇవన్నీ ప్రేక్షకులు మెచ్చుకున్నవి, బ్లాక్ బస్టర్ ముద్ర వేయించుకున్నవే.

అలాంటప్పుడు నాగ్ అశ్విన్ కేవలం యానిమల్ ని మాత్రమే టార్గెట్ చేశాడు అనుకోవడం అర్ధరహితం. కల్కి హీరో ప్రభాసే నెక్స్ట్ సందీప్ వంగాతో స్పిరిట్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన డిస్కషన్ కల్కి షూటింగ్ స్పాట్లో ప్రభాస్, అశ్విన్ ల మధ్య వచ్చే ఉంటుంది. మరి కావాలని తన తోటి దర్శకుడిని చిన్నబుచ్చాలని అతనికీ ఉండదుగా. ఇంత లోతుగా అర్థం చేసుకోలేని కొందరు అశ్విన్ అన్నది కేవలం సందీప్ వంగానే అనే పెడర్థాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. ఈ ట్రాప్ లో పడ్డవారు లేకపోలేదు. ఏది ఏమైనా ఒక్కోసారి మన ఉద్దేశాలు ఇంకోలా జనంలోకి వెళ్ళినప్పుడు ఆ డ్యామేజ్ రిపేర్ చేసుకోవడం కొంత ఇబ్బందే.