అఖిల్….ఒకటి కాదు మూడు సినిమాలు

ఏజెంట్ చేసిన డిజాస్టర్ గాయమేమో కానీ అఖిల్ కొత్త సినిమా మొదలుపెట్టక ఏడాది గడిచిపోవడంతో అభిమానులు అసహనంగా ఉన్న మాట వాస్తవం. ఎవరికీ ఫ్లాప్ రానట్టు దానికి ఇంత బాధ పడి గ్యాప్ తీసుకోవాలా అనే ప్రశ్నలో న్యాయముంది కానీ నిజానికి అఖిల్ ఇదంతా కావాలని చేసింది కాదు. యువి క్రియేషన్స్ నిర్మించబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీ మేకోవర్ కోసం ఇంత సమయం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అనిల్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ గ్రాండియర్ ని త్వరలోనే లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అఖిల్ ప్లానింగ్ కేవలం ఒక్క మూవీతో ఆగడం లేదు.

మరో రెండు సినిమాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. వాటిలో మొదటిది స్వంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఫిక్స్ చేయబోయేది. వినరో భాగ్యము విష్ణుకథతో ప్రేక్షకులను మెప్పించిన ఈ డైరెక్టర్ చెప్పిన చిత్తూరు బ్యాక్ డ్రాప్ కథ నచ్చడంతో నాగ్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. నాగ చైతన్యకు ఏ మాయ చేశావే రూపంలో మంచి బ్రేక్ ఇచ్చిన గౌతమ్ వాసుదేవ మీనన్ తోనూ ఒక మూవీ చేయాలనీ అఖిల్ ఆసక్తి చూపిస్తున్నాడు. ఆయన దగ్గర కథ సిద్ధంగా ఉందని సమాచారం. కాకపోతే కొంచెం టైం పడుతుంది.

ఇప్పుడొచ్చిన గ్యాప్ పూర్తిగా తీరిపోయేలా అఖిల్ రాబోయే మూడేళ్ళకు సరిపడా బిజీగా ఉండేలా ప్రణాళిక రచిస్తున్నట్టు కనిపిస్తోంది. పరిశ్రమకు వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ తన ఖాతాలో బ్లాక్ బస్టర్ లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఒకటే డీసెంట్ సక్సెస్ అందుకోగా మిగిలినవన్నీ ఫ్లాపే. నాగ్ ని మించి మాస్ హీరో అవుతాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో అఖిల్ కెరీర్ ఇలా నెమ్మదించడం కొంత ఆందోళన కలిగించేదే అయినా ఇక నుంచి ఇదే ఫ్లోని కొనసాగిస్తే ఎక్కడో చోట పెద్ద బ్రేక్ దొరుకుతుంది. మోహన్ రాజాతోనూ ఒక సినిమా అనుకున్నారు కానీ కార్యరూపం దాల్చలేదు.