మనసులు గెలుచుకున్న సాయి ధరమ్ తేజ్

సామాజికంగా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సెలబ్రిటీలు స్పందించడం ప్రతి సందర్భంలోనూ జరగదు. కొన్నిసార్లు ఇష్యూలో ఉన్న సున్నితత్వం వల్ల లేదా ఆయా విషయాల పట్ల స్టార్ల కున్న అభిప్రాయాల వల్ల ఉండకపోవచ్చు. రెండు రోజుల క్రితం సోషల్ మీడియాని ఊపేసిన యూట్యూబర్ల ఉదంతం గురించి ఆన్ లైన్ ఎంతగా అట్టుడుకిపోతోందో చూస్తున్నాం. తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుని దానికి విపరీత అర్థాలు తీసి ఫాలోయర్స్ కి డార్క్ కామెడీ పేరుతో నవ్వించాలని చూసిన యువకుల ప్రయత్నం అడ్డంగా బెడిసి కొట్టడమే కాదు వాళ్ళ కుటుంబాలకు చెడ్డ పేరు తెచ్చింది.

ముందు కేవలం ట్విట్టర్ కు మాత్రమే పరిమితమైన ఈ వివాదం ఎప్పుడైతే సాయి ధరమ్ తేజ్ చొరవ తీసుకుని ఎక్స్ వేదికగా వాళ్ళను శిక్షించాలని మెసేజ్ పెట్టాడో అక్కడి నుంచి కొత్త మలుపు తీసుకుంది, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కీలక పోలీసు అధికారులను ట్యాగ్ చేయడంతో ఒక్కసారిగా దీని మీద అందరూ దృష్టి సారించడం మొదలుపెట్టారు. క్రమంగా విశ్వక్ సేన్, సందీప్ కిషన్ లాంటి ఇతర హీరోలు తేజుకి మద్దతుగా నిలచి ఇలాంటి దుర్మార్గ ఆలోచనలున్న వాళ్ళను కట్టడి చేయాలని పిలుపు ఇవ్వడంతో అందరు అభిమానులు ఈ నిరసనలో భాగమవుతున్నారు.

ఏపీ తెలంగాణ పోలీసుల వైపు నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించడంతో డిపార్ట్ మెంట్ సీరియస్ గా తీసుకుంది. సాయి తేజ్ మావయ్య పవన్ కళ్యాణ్ ఏపి డిప్యూటీ సీఎం కాబట్టి ఈ వ్యవహారం అంతు చూసే దాకా వ్యవస్థ పని చేస్తూనే ఉంటుంది. ఏది ఏమైనా ఇలాంటి ఖండించాల్సిన సంఘటన పట్ల సాయి ధరమ్ తేజ్ వేగంగా స్పందించిన వైనం మనసులు గెలుచుకుంటోంది. ఫ్యాన్స్ సైతం ఇతని మంచి మనసు మీద ప్రశంసలు గుప్పిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి చైతన్య కలిగించేలా టాలీవుడ్ స్టార్లు స్పందించాలని కోరుతున్నారు.