రాజమౌళి ఎంపికపై అనుమానం వద్దు

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీర రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీలో విలన్ గా సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ లాకయ్యాడనే వార్త నిన్న సాయంత్రం నుంచి మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా అందరూ బలమైన నిర్ధారణకు వచ్చారు. లీకైన సోర్స్ కాస్త బలంగా ఉండటంతో వార్తకు రెక్కలు వచ్చేశాయి. నలభై రోజుల క్రితమే దీన్ని మా సైట్ బ్రేక్ చేసిన విషయం విదితమే. ఇప్పుడదే నిజమవబోతోంది. అయితే రాజమౌళి ఆయనని ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం సలారే కావొచ్చని ఫ్యాన్స్ నమ్మకం.

అడవుల బ్యాక్ డ్రాప్ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందనున్న ఎస్ఎస్ఎంబి 29లో ఎవరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే క్లూస్ ఇంకా బయటికి రాలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి విశేషాలు పంచుకునే దాకా ఈ సస్పెన్స్ కొనసాగేలా ఉంది. ఇండియానా జోన్స్ తరహాలో ఫారెస్ట్ అడ్వెంచర్ అనే హింట్ గతంలో జక్కన్నతో పాటు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇచ్చారు కానీ అంతకు మించిన డీటెయిల్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే హీరోగా దర్శకుడిగా చాలా బిజీగా ఉన్న పృథ్విరాజ్ ఇప్పుడీ మహేష్ 29కి సుదీర్ఘ కాలం డేట్లు ఇవ్వగలడా అనేది పెద్ద ప్రశ్న.

అదేమీ అసాధ్యం కాదు కానీ మహేష్ బాబుకి ధీటుగా పృథ్విరాజ్ విలనీ పండించడం ఏ మేరకు వర్కౌట్ అవుతుందనే దాని మీద సందేహం అక్కర్లేదు. ఎందుకంటే నాని ఈగలో కన్నడ స్టార్ సుదీప్ ని ఎంచుకున్నప్పుడు అనుమానం వ్యక్తం చేసినవాళ్లు ఎందరో. వాటిని పటాపంచలు చేస్తూ ఆ క్యారెక్టర్ ని తెరమీద అద్భుతంగా పండించారు. ఇప్పుడు పృథ్విరాజ్ నుంచి కూడా అదే రేంజ్ అవుట్ ఫుట్ రాబట్టుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎమోషన్లు, ఎలివేషన్లు బ్యాలన్స్ తప్పకుండా మేజిక్ చేసే రాజమౌళి ఈసారి మహేష్ బాబుని ఎలా చూపిస్తాడో ఊహించుకోవడం కష్టమే.