హరిహర వీరమల్లు ప్రోగ్రెస్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయ్యాక రిలీజయ్యే మొదటి పవన్ కళ్యాణ్ సినిమాగా అభిమానులు ఓజి రావాలని కోరుకున్నారు కానీ దాని స్థానంలో హరిహర వీరమల్లు 1 వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ విడుదల లక్ష్యంగా నిర్మాత ఏఏం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ ఈ పనుల మీదే ఉన్నారు. విపరీతమైన జాప్యం వల్ల క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నప్పటికీ ముఖ్యమైన భాగాలు ముందే షూట్ చేసి ఉండటం వల్ల కొత్తగా బాధ్యత తీసుకున్న జ్యోతికృష్ణకు అంత భారం లేదని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉండగా ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి రత్నం కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఇచ్చారు.

విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన వర్క్ ప్రస్తుతం పలు ప్రదేశాల్లో జరుగుతోంది. మచిలీపట్నం పోర్టులో తీసిన ఎపిసోడ్ ని ఇరాన్ కంపెనీకి ఇచ్చారు. అయితే అక్కడి టీమ్ కి భాష సమస్య రావడంతో వల్లనే ఇక్కడికి పిలిపించి ఏం చేయాలో సూచిస్తున్నారు. కుస్తీ ఫైట్ పనిని బెంగళూరు సంస్థ చేస్తుండగా ఛార్మినార్ సీక్వెన్స్ ని హైదరాబాద్ లోనే ఎడిట్ చేస్తున్నారు. పులితో తలపడే సన్నివేశం అద్భుతంగా రావాలనే ఉద్దేశంతో రాజీ లేకుండా కెనడాకు పంపించారు. సిజిఐ మొత్తం దాదాపు పూర్తయ్యే స్టేజిలోనే ఉంది. క్వాలిటీ తగ్గకుండా వేగంగా చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ సెట్ చేశారు.

వాస్తవానికి అమెజాన్ ప్రైమ్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం అక్టోబర్ లోనే విడుదల చేయాలి. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కుదరకపోవడంతో వాళ్ళను రిక్వెస్ట్ చేసుకుని డిసెంబర్ ని లక్ష్యంగా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకో 25 రోజులు డేట్స్ ఇస్తే మొత్తం పూర్తవుతుంది. కానీ అటు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖల పనులతో పవన్ కళ్యాణ్ మాములు బిజీగా లేడు. జూలై లేదా ఆగస్ట్ నుంచి క్రమం తప్పకుండా డేట్లు ఇచ్చి హరిహర వీరమల్లు 1 పూర్తి చేసే దిశగా పవన్ హామీ ఇచ్చినట్టు వినికిడి. ఎలా చూసుకున్నా ఈ ఏడాది పవర్ స్టార్ ని అభిమానులు తెరమీద చూసుకోవడం ఖాయమే.