డార్లింగ్ చెప్పేసిన కల్కి 2 శుభవార్త

కల్కి 2898 ఏడికి సంబంధించి అందరి మనస్సులో ఉన్న ప్రశ్న ఒక్కటే. దీనికి సీక్వెల్ ఉంటుందా లేదాని. కొన్ని లీక్స్ పక్కాగా వస్తుందని చెప్పినప్పటికీ పోస్టర్స్ లో ట్రైలర్ లో ఎక్కడా మొదటి భాగమని చెప్పకపోవడంతో అనుమానాలు అలాగే ఉండిపోయాయి. దానికి అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్, దర్శకుడు నాగఅశ్విన్ స్వయంగా పాల్గొన్న ఇన్స్ టా లైవ్ లో స్వయంగా డార్లింగ్ నోటి వెంటే ఈ శుభవార్త వచ్చేసింది. రిలీజ్ తర్వాత పది రోజులు రెస్ట్ తీసుకుని పార్ట్ 2 పనులు మొదలుపెట్టామని నాగ్ అశ్విన్ కి సూచించడంతో ప్రత్యక్షంగా వింటున్న అభిమానుల ఆనందానికి అంతులేదు.

నిజానికి కల్కి లాంటి గ్రాండియర్ కి ఒక్క భాగం సరిపోదు. బాహుబలి, కెజిఎఫ్ లను మించిన స్కేల్ కాబట్టి అవెంజర్స్ తరహాలో మూడు నాలుగు భాగాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. కాకపోతే వైజయంతి బృందం ఎలాంటి ప్లాన్ లో ఉందో ఇప్పుడప్పుడే బయటికి రాదు. నాగఅశ్విన్ మహాభారత యుద్ధంతో మొదలుపెట్టి, కృష్ణుడు అవతారం చాలించే ఘట్టం నుంచి కలియుగంలో కల్కి ఆవిర్భావం దాకా జరిగే పరిణామాలకు సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ని జోడించి మూడు సరికొత్త ప్రపంచాల్లోకి విహారం చేయించబోతున్నాడు. అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో బుకింగ్స్ తేటతెల్లం చేస్తున్నాయి.

థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ ని విభ్రాంతికి గురి చేస్తానని నాగ అశ్విన్ చెప్పడం చూస్తుంటే అంచనాల బరువు మోయడం కష్టమే అనిపిస్తోంది. ఉదయం నాలుగు గంటల నుంచే షోలు మొదలవుతున్న నేపథ్యంలో తెల్లవారకముందే సోషల్ మీడియాలో టాక్ తిరగనుంది. అటు నార్త్ లోనూ బుకింగ్స్ భీభత్సంగా ఉన్నాయి. మెల్లగా ఉందనుకున్న తమిళనాడు, కేరళలో అనూహ్యంగా పికప్ కనిపించడం శుభ పరిణామం. రేపీ సమయానికి పూర్తి రివ్యూలు, రిపోర్టులు వచ్చేసి ఉంటాయి. పాజిటివ్ గా ఉంటే మాత్రం ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డుల్లో ఏదైనా మిగలడం అనుమానమే.