ఆస్కార్ అకాడెమీలో 11 భారతీయులు

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సినిమాలకు గుర్తింపు ఇచ్చే అవార్డుగా పేరున్న ఆస్కార్ విజేతలను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఉందన్న సంగతి తెలిసిందే. వీళ్ళ ఓట్లు చాలా కీలకంగా పరిగణించబడతాయి. దేశ విదేశాల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులతో ఈ వడబోత మాములుగా ఉండదు. అయితే ఈసారి సభ్యులుగా ఏకంగా పదకొండు మంది భారతీయులు చోటు దక్కించుకోవడం గర్వకారణంగా చెప్పాలి. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు అకాడెమి అవార్డు సాధించడంతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో దాన్ని బ్లాక్ బస్టర్ లో చేయడంలో దర్శకుడు రాజమౌళి చేసిన కృషి కళ్లారా చూశాం.

ఇప్పుడు దానికి గుర్తింపు సతీ సమేతంగా దక్కింది. అకాడెమిలో రాజమౌళితో పాటు ఆయన భార్య స్థానం సంపాదించుకున్నారు. కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆవిడకు ఈ గౌరవం దక్కింది. మిగిలిన పేర్లు చూస్తే ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ అధినేత రితీష్ సిధ్వాని, ప్రసిద్ధ కెమెరామెన్ రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ 2 పనితనానికి), శీతల్ శర్మ (గంగూబాయ్ కటియావాడి డిజైనర్), రీమా దాస్ (విలేజ్ రాక్ స్టార్స్ దర్శకురాలు), నిషా పహుజా (టు కిల్ ఏ టైగర్ డైరెక్షన్), హేమా త్రివేది (సేవింగ్ ఫేస్ డాక్యూమెంటరీ), జితేష్ పాండ్య (పిఆర్ మార్కెటింగ్ నిపుణుడు), ప్రేమ్ రక్షిత్ (ప్రొడక్షన్ టెక్నాలజీ) లిస్టులో ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ బృందం నుంచి ముగ్గురు ఎంపిక కావడం టాలీవుడ్ కు గర్వకారణమే. ఆస్కార్ బోర్డు పూర్తిగా తెల్ల మనుషులతో నిండిపోయి అమెరికా సినిమాలు తప్ప మరొకటి గుర్తించే స్థితిలో లేదనే కామెంట్లు గత కొంత కాలంగా సీరియస్ గా వినిపిస్తున్న నేపథ్యంలో అకాడెమి విదేశీ చిత్రాలను మరింత సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టింది. ఆర్ఆర్ఆర్, పారసైట్ లు ఆ కారణంగానే పురస్కారాలు దక్కించుకున్నాయనే మాట వాస్తవం. ఇప్పుడు మెంబెర్స్ రూపంలోనూ ప్రాధాన్యత కలిగించడం చూస్తే క్రమంగా మనకూ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతోంది.