డబుల్ ఇస్మార్ట్ పోటీని తట్టుకోగలరా

కొద్దిరోజుల క్రితం పుష్ప 2 ది రూల్ ముందు నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చిన ఆగస్ట్ 15 విడుదల తేదీని వదులుకోవడం ఇతర నిర్మాతలను అలెర్ట్ చేసేసింది. ఏకంగా డిసెంబర్ 6కి వెళ్లిపోవడంతో మంచి కామధేనువు లాంటి ఇండిపెండెన్స్ డేని వాడుకోవాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. వాటిలో ముందుగా కర్చీఫ్ వేసింది డబుల్ ఇస్మార్ట్. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కుతున్న ఈ ఊర మాస్ ఎంటర్ టైనర్ ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మారకూడదని టీమ్ డే అండ్ నైట్ పని చేస్తోంది. ఈ వారంలోనే లిరికల్ వీడియో వస్తోంది.

ఇదిలా ఉండగా డబుల్ ఇస్మార్ట్ లాంటి పెద్ద పోటీ పెట్టుకుని పెద్ద సంస్థలు నిర్మించిన చిన్న సినిమాలు పోటీకి సై అనడం ఆశ్చర్యం కలిగించే విషయం. నివేతా థామస్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన 35 చిన్న కథ కాదు ఇవాళ రివీల్ చేసిన టైటిల్ లాంచ్ లో విడుదలని స్పష్టంగా ఆగస్ట్ 15 అని చెప్పేశారు. ఏషియన్, సురేష్ ఇద్దరి భాగస్వామ్యం కావడంతో థియేటర్ డిస్ట్రిబ్యూషన్ పరంగా ఇబ్బంది ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె రెండో సినిమా ఆయ్ సైతం అదే డేట్ తీసుకుంటోంది. అల్లు అరవింద్, బన్నీ వాస్ లాంటి ప్రొడ్యూసర్లు ఉంటె టెన్షన్ పడేందుకు ఏముంటుంది.

ఇక్కడ మెదులుతున్న సందేహం ఒకటే. స్టార్ క్యాస్టింగ్ లేని రెండు సినిమాలు ఎంత కంటెంట్ ఉన్నా సరే మరీ డబుల్ ఇస్మార్ట్ తో ఒకే రోజు తలపెడితే రిస్క్ కదా. కానీ అప్పటికంతా పూరి నిజంగా మాటకు కట్టుబడి మూవీని రిలీజ్ చేస్తాడా అనేది వెంటనే చెప్పలేని ప్రశ్న. ఇవి కాకుండా బాలీవుడ్ చిత్రాలు వేదా, స్త్రీ 2 సైతం కాంపిటీషన్ కి సై అంటున్నాయి. పుష్ప 2 తప్పుకోవడం వరకు ఓకే కానీ ఇలా ఒకేసారి త్రిముఖ పోటీ పడటం బాక్సాఫీస్ పరంగా ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. ఇంతే కాదు మరో రెండు సినిమాలు ఆగస్ట్ 15 మీదే కన్నేశాయట. ప్రకటన వస్తే కానీ క్లారిటీ రాదు.