ఒళ్ళు జలదరించేలా వార్ 2 యాక్షన్

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న బాలీవుడ్ అతి పెద్ద మల్టీస్టారర్ వార్ 2 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. స్వంత బ్యానర్ లో రూపొందుతున్న దేవరతో పాటు దీన్ని బ్యాలన్స్ చేసుకుంటూ తారక్ క్రమం తప్పకుండ ముంబైకి ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు. వార్ 2కు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ గురించి వస్తున్న సమాచారం అభిమానులకు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇవ్వబోతున్నాయి. వీటిలో ఇటీవలే చిత్రీకరించిన స్పీడ్ బోట్ ఛేజ్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. 6 రోజుల పాటు ఏకధాటిగా దీని చిత్రీకరణ జరిగిందని సమాచారం.

హోరున ఎగసే అలల మధ్య జరిగే ఈ పడవల పందెంని డిజైన్ చేయడానికే మూడు నెలలు పట్టిందట. సౌత్ ఆఫ్రికాకు చెందిన యాక్షన్ డైరెక్టర్ ఫ్రాన్జ్ స్పిల్హాస్ నేతృత్వంలో షూట్ చేశారు. ఈయన గతంలో డొమినియన్, వార్, టైగర్ 3కి పని చేశాడు. ఇతనితో పాటు వాటర్ సీక్వెన్స్ తీయడంలో నిపుణుడైన జాసన్ మార్టిన్ దీనికి సహాయకుడిగా పని చేశాడు. ఇతని ట్రాక్ రికార్డులో టూంబ్ రైడర్, వన్ పీస్, రెసిడెంట్ ఈవిల్ లాంటి బ్లాక్ బస్టర్లున్నాయి. ఉత్కంఠభరితంగా ఏ హాలీవుడ్ మూవీకి తీసిపోని రీతిలో దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ 2 పోరాట సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నాడని సమాచారం.

చూస్తుంటే అంచనాలకు మించే వార్ 2 ఉండబోతోందనే క్లారిటీ వచ్చేస్తోంది. 2025 ఆగస్ట్ విడుదల ప్లాన్ చేసినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరం ఉండటంతో జనవరికల్లా షూట్ పార్ట్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు అయాన్. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు, దేవర పార్ట్ 2 సెట్లలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. సో వాటికి డేట్లు కేటాయించాలంటే ముందు వార్ 2 పూర్తవ్వాలి. అంతే కాదు హృతిక్, తారక్ ల మధ్య ఎయిర్ క్రాఫ్ట్ లో పెట్టిన యాక్షన్ ఫైట్ సైతం అంతకు మించి అనేలా ఉంటుందట. చూస్తుంటే ఇదేదో మాములు రచ్చలా కనిపించడం లేదు.