రెట్టింపు స్థాయిలో రష్మిక పారితోషికం

బాలీవుడ్ జెండా పాతాలని, అక్కడి దర్శక నిర్మాతలు వెంటపడాలని సౌత్ హీరోయిన్లు ఆరాట పడటం సహజం. ఇది దశాబ్దాల కాలం నుంచి ఉన్నదే. విజయశాంతి నుంచి పూజా హెగ్డే దాకా ఎందరో కథానాయికలు అక్కడ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. కానీ సక్సెసైనవాళ్ళు తక్కువ. రెండేళ్ల క్రితం 2022లో అమితాబ్ బచ్చన్ గుడ్ బై ద్వారా నార్త్ లో తెరంగేట్రం చేసిన రష్మిక మందన్నకు డెబ్యూనే డిజాస్టర్ పలకరించింది. అయినా సరే నిరాశపడకుండా సిద్దార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో మూగమ్మాయిగా నటించింది. డైరెక్ట్ ఓటిటి రిలీజైనా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. దెబ్బకు డబుల్ నిరాశ.

గత డిసెంబర్ లో వచ్చిన యానిమల్ ఒక్కసారిగా తన జాతకాన్ని మార్చేసింది. రన్బీర్ కపూర్ వయొలెంట్ యాక్టింగ్ కి ధీటుగా తొణక్కుండా నటించి మార్కులు, ఆఫర్లు రెండూ కొట్టేసింది. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా యాక్షన్ మూవీ ‘సికందర్’ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. దీని రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుకానుంది. ముంబై టాక్ ప్రకారం ఈ ప్యాన్ ఇండియా మూవీకి గాను రష్మికకు ఇచ్చిన పారితోషికం 13 కోట్ల దాకా ఉందట. ఇప్పటిదాకా తన కెరీర్ లో ఇదే అత్యధిక మొత్తం. నాలుగు నుంచి ఏడు కోట్ల మధ్యలో తీసుకున్న శ్రీవల్లికి ఇది భారీ మొత్తం.

సల్మాన్ అంతటి సీనియర్ మోస్ట్ సరసన ఓకే చెప్పడానికి ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ తో తెలుగులో చేస్తున్న రష్మిక మందన్న హిందీలో విక్కీ కౌశల్ తో చావా అనే చారిత్రాత్మక సినిమా చేస్తోంది. ప్రతిదీ క్రేజ్ ఉన్న ప్రాజెక్టు కావడంతో డిమాండ్ మాములుగా లేదు. ఇప్పటికిప్పుడు డేట్లు కావాలన్నా దొరికే పరిస్థితి లేదు. జూలైలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న సికందర్ లో క్రేజీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. రష్మిక ట్రైనింగ్ తీసుకోనుందని తెలిసింది. ప్రస్తుతం శివకార్తికేయన్ సినిమా చివరి దశ చిత్రీకరణలో మురుగదాస్ బిజీగా ఉన్నాడు.