పుష్ప-2 బిజినెస్ లెక్కలు తారుమారు

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన పుష్ప-2 ఆగస్టు 15 నుంచి వాయిదా పడడం లాంఛనమే అన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండు రోజుల కిందటే ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నారు దర్శక నిర్మాతలు. సినిమాను వాయిదా వేసే విషయంలో చాలా కోపంగా ఉన్న హీరో అల్లు అర్జున్‌ను సైతం సుకుమార్ అండ్ టీం కన్విన్స్ చేసేశారట. త్వరలోనే వాయిదా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సినిమాను అనుకున్న ప్రకారమే ఆగస్టు 15న రిలీజ్ చేయించాలన్న ఉద్దేశంతో నిర్మాతలు దర్శకుడు సుకుమార్‌ను ఒప్పించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. సుకుమార్ అండ్ టీం పంతం పట్టి పని చేస్తే రిలీజ్ డేట్‌ను అందుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ ప్రభావం ఔట్ పుట్ మీద పడుతుందనే ఉద్దేశంతో సుకుమార్ రాజీ పడట్లేదని సమాచారం.

ఐతే ఇప్పటికే సినిమా మీద చాలా టైం, విపరీతంగా ఖర్చు పెట్టి దాదాపుగా బిజినెస్ డీల్స్ అన్నీ క్లోజ్ చేసిన నిర్మాతలు.. వాయిదా నిర్ణయంతో లబోదిబోమంటున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో పుష్ప-2 బిజినెస్ లెక్కలన్నీ తారుమారు అవుతున్నాయట. వాయిదా వల్ల అడ్వాన్సులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లతో తలనొప్పి తప్పదు. ఆలస్యం వల్ల వారికి జరిగే వడ్డీల నష్టాన్ని నిర్మాతలే భరించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఓవరాల్ రేట్లలో రిబేట్ ఇవ్వాలి.

మరోవైపు డిజిటల్ హక్కుల కోసం చేసుకున్న ఒప్పందాన్ని కూడా తప్పనిసరిగా రివైజ్ చేయాల్సిందే. ఇక్కడ కూడా కొంత ఆదాయంలో కోత పడుతుంది. ఇక అదనపు వర్కింగ్ డేస్ కోసం పెట్టే ఖర్చు భారమూ ఉంటుంది. ఫైనాన్స్ వడ్డీలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ పక్కన పెడితే.. ఆగస్టు 15 అన్నది సూపర్ డేట్. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. పోటీ ఉండదు. ఇప్పుడు క్రిస్మస్ లేదా మరో డేట్ చూసుకోవాలి. అది ఇప్పుడున్నంత అనుకూలంగా ఉండకపోవచ్చు. పోటీ సమస్య కూడా తలెత్తవచ్చు. వాయిదా వల్ల సినిమా బజ్ మీద కూడా ప్రభావం పడొచ్చు. ఇలా డేట్ మార్చడంతో ‘పుష్ప-2’ నిర్మాతల తలనొప్పులు అన్నీ ఇన్నీ కావు.