ఫ్యాన్ మర్డర్ – సరికొత్త మలుపులు

ఒక మంచి క్రైమ్ వెబ్ సిరీస్ కు సరిపడా కంటెంట్ కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసులో దొరుకుతోంది. స్వయానా తన అభిమాని హత్య కేసులో చిక్కుకున్న ఈ కాటేరా కథానాయకుడు అంత సులభంగా బయటికి వచ్చేలా కనిపించడం లేదు.

తాజాగా పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో రేణుకస్వామిని తొలుత కిడ్నాప్ చేసిన సంగతి తనకు తెలియదని, సరే ఎలాగూ వచ్చాడు కదాని పవిత్రని తీసుకెళ్లి మరోసారి చేయొద్దని వార్నింగ్ ఇవ్వడం తప్ప ఏం చేయలేదని నమ్మబలికినట్టు తెలిసింది. అంతేకాదు వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళమని డబ్బులు కూడా ఇచ్చినట్టు పేర్కొన్నాడు. ఇదంత గుడ్డిగా నమ్మేలా లేదు.

క్రమంగా మరిన్ని భీతిగొలిపే నిజాలు బయటికి వస్తున్నాయి. శాండల్ వుడ్ మీడియా ప్రకారం గత వారం రేణుకస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకి ఎత్తుకొచ్చారు.

రాత్రి 7 గంటలకు దర్శన్ అభిమాని కి చెందిన షెడ్డుకి తీసుకొస్తే మరుసటి రోజు తెల్లవార్జుఝామున 3 గంటల వరకు చిత్రహింసలు పెట్టారట. పవిత్ర గౌడ చెప్పుతో అతన్ని కొడితే పలు ఆయుధాలతో దర్శన్, ఫ్యాన్స్ దారుణంగా గాయపరిచినట్టు ఆధారాలు దొరికాయట.

గోడకేసి బాదాక చనిపోయాడని తెలిసి ఇదంతా మేనేజ్ చేయడానికి పవన్ అనే వ్యక్తికి 30 లక్షలు ఇచ్చినట్టు కథనాలు వస్తున్నాయి. ఇదే సొమ్ముని వినయ్ అనే వ్యక్తి గ్యాంగుకి నేరం మోయడానికి లంచంగా ఇచ్చారట.

ఇదంతా జరిగే క్రమంలో ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ సహాయం చేసినట్టు వినిపిస్తోంది. దర్శన్ ఇంత ఘోరానికి పాల్పడినా కొందరు అబిమానులు సమర్ధిస్తూ నిరసనలు చేయడం పట్ల ఇప్పటికే కర్ణాటకలో ఆందోళన వ్యక్తమవుతోంది.

పవిత్ర గౌడ, దర్శన్ తో సహా మొత్తం 15 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. హీరో మాత్రం నేనేం చేయలేదని లాయర్ సలహా మేరకు సినిమా ఫక్కీలో నటిస్తున్నప్పటికీ వ్యవహారం మాత్రం అతన్ని పీకల్లోతులోకి దింపేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే దర్శన్ హీరోగా సెట్స్ మీదున్న సినిమాల్లో దాదాపు వంద కోట్లు బ్లాక్ అయినట్టు సమాచారం. పాపం నిర్మాతలు.