తమ్ముడూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు

Pawan Kalyan

ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమిలో భాగంగా జనసేన సాధించిన ఘనవిజయం పట్ల అభిమానుల ఆనందం మాములుగా లేదు. సాధారణంగా ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ సంతోషాన్ని సక్సెస్ మీట్ రూపంలో ఫ్యాన్స్ తో కలిసి జరుపుకుంటారు. కానీ రాజకీయాల్లో అలాంటివి ఉండవు.

ఏదున్నా కార్యకర్తల మధ్యే జరిగిపోవాలి తప్పించి నాయకులు రాలేరు. అలాంటి సందర్భం ఏది దొరుకుతుందాని ఎదురు చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి తమ్ముడు రీ రిలీజ్ ఒక వేదికగా దొరికింది. తమ సెలబ్రేషన్ కి ఇదే మంచి అవకాశంగా భావించి పూర్తిగా వాడేసుకున్నారు.

నిన్న జరిగిన తమ్ముడు రీ రిలీజ్ షోలను పవన్ ఫాలోయర్స్ ఒక పండగలా జరుపుతున్నారు. నిన్న ఉదయం, సాయంత్రం హైదరాబాద్ దేవి, సుదర్శన్ థియేటర్ల వద్ద కోలాహలం మాములుగా లేదు. నిలువెత్తు పవన్ కళ్యాణ్ కటవుట్ పెట్టి బాణాసంచాలు, డీజేలతో క్రాస్ రోడ్స్ మొత్తాన్ని హోరెత్తించారు.

అక్కడే కాదు వైజాగ్, గుంటూరు, కర్నూలు, నంద్యాల తదితర చోట్ల ఇదే సీన్ కనిపించింది. అయితే తమ్ముడు ఇంతకు ముందే ఒకసారి రీ రిలీజ్ జరుపుకుంది. తక్కువ గ్యాప్ లో మళ్ళీ తీసుకురావడంతో రెండు మూడు షోలకు తప్పించి మిగిలిన వాటికి ఇంత స్థాయిలో స్పందన లేదు.

ఓజి వాయిదా పడింది కానీ లేదంటే సెప్టెంబర్ లో థియేటర్ల దగ్గర భీభత్సం ఇంకో స్థాయిలో ఉండేది. ఇది తెలిసే తమ్ముడుని వాడుకున్నారు ఫాన్స్. ప్రస్తుతం డిప్యూటీ సిఎం పదవితో పాటు కీలక శాఖల బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్ బ్యాలన్స్ ఉన్న మూడు సినిమాలు హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయడమే పెద్ద సవాల్ గా ఫీలవుతున్నారు.

జనసేన కార్యకలాపాలతో పాటు తన మీద ఉన్న పిఠాపురం అభివృద్ధి, శాఖల నిర్వహణ వగైరా పనులన్నీ చూసుకుంటూ చిత్రీకరణలో పాల్గొనాలి. తన డేట్స్ ని బట్టే హరిహర వీరమల్లు 2024లో వస్తుందా రాదానేది తేలనుంది.