మెగా విభేదాల గురించి నీహారిక

ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి శిల్పారవిచంద్రరెడ్డికి అల్లు అర్జున్ బహిరంగ మద్దతు ఇచ్చినప్పటి నుంచి మెగాభిమానులు వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వేడి రాజుకుంది. అది కేవలం తన స్నేహితుడికి సపోర్ట్ తప్ప పార్టీకి కాదని, జనసేన గెలవాలని కోరుకుంటున్నానని బన్నీ చెప్పినప్పటికీ వేడి చల్లారలేదు. అసలు మెగా, అల్లు కుటుంబాల మధ్యే ఏవో మనస్పర్థలు ఉన్నాయనే ప్రచారం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. పలు సందర్భాల్లో అరవింద్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగినా ఆయన వెర్షన్ కన్నా సోషల్ మీడియాలో విభేదాల టాపిక్ ఎక్కువ హైలైట్ అవుతూ వచ్చింది.

ఇటీవలే సాయి దుర్గ తేజ్ సామాజిక మాధ్యమాల్లో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేశాడనే వార్త మరింత ఆజ్యం పోసింది. దీని గురించి నిన్న జరిగిన కమిటీ కుర్రాళ్ళు టీజర్ లాంచ్ లో నిర్మాత నిహారిక కొణిదెల నుంచి ఊహించని సమాధానం వచ్చింది. ఈ విషయం తనకు తెలియదని క్షమాపణ చెబుతూనే, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఎవరి కారణాలు వారికి ఉంటాయి కాబట్టి తనవైపు నుంచి చెప్పాల్సింది ఏమీ లేదని కుండబద్దలు కొట్టింది. ఒకవేళ ఇలా కాకుండా అలాంటిదేమి లేదని, మెగా అల్లు హీరోల మధ్య విభేదాలు లేవని చెప్పి ఉంటే ఆ వీడియో వైరలయ్యేది కాదు.

ఫ్యాన్స్ అనుక్షణం ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి వాటిలో క్షణ క్షణం అప్రమత్తంగా ఉన్న ట్రెండ్ లో సెలబ్రిటీల నుంచి వచ్చే ఏ చిన్న యాక్టివిటీ అయినా సరే వెంటనే లక్షలు, కోట్లలో రీచ్ తెచ్చుకుంటోంది. చిరంజీవి, అరవింద్ ఫ్యామిలీస్ మధ్య పొరపొచ్చాలు లేవని, పండగల లాంటి సందర్భాలు వచ్చిన ప్రతిసారి కలుసుకోవడం ఫోటోలు వీడియోల రూపంలో బయటికి వచ్చినా ప్రచారం మాత్రం ఆగడం లేదు. నిజానికి నీహారికకు ఈ వ్యవహారానికి నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ ఆ కుటుంబ సభ్యురాలే కాబట్టి తన సమాధానం గురించి జనాలు ఇంతగా మాట్లాడుకున్నారు.