మళ్లీ నాగార్జుననే నమ్ముకున్న యంగ్ హీరో

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే మంచి స్థాయిని అందుకున్న కథానాయకుడు రాజ్ తరుణ్‌. అతడి తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’ సూపర్ హిట్. ఆ తర్వాత చేసిన ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’ కూడా మంచి విజయం సాధించాయి. దీంతో అతడి మీద అంచనాలు పెరిగిపోయాయి. తనతో సినిమాల కోసం దర్శకులు, నిర్మాతలు లైన్లో నిలబడ్డారు. కానీ ఇలా కెరీర్ ఆరంభంలో మంచి ఊపు చూపించి ఆ తర్వాత డౌన్ అయిపోయిన హీరోలు చాలామందే ఉన్నారు. రాజ్ తరుణ్ సైతం ఆ జాబితాలోనే చేరాడు.

గత మూణ్నాలుగేళ్లలో అతను చేసిన సినిమాలేవీ ఆడలేదు. ఒకదాని తర్వాత ఒకటి సినిమా వస్తూనే ఉంది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతూనే ఉంది. అగ్ర నిర్మాత దిల్ రాజు అతడితో ‘లవర్’ తీసి చేతులు కాల్చుకోగా.. మళ్లీ అతడికి హిట్టివ్వాలన్న పట్టుదలతో ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమా తీశాడు. కానీ అది కూడా తుస్సుమంది.

దీని తర్వాత రాజ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ త్వరలోనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో విడుదల కాబోతోంది. దాని సంగతేమవుతుందో చూడాలి. ఈలోపు ఈ యంగ్ హీరో మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. ఇంతకుముందు రాజ్‌తో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అనే సినిమా తీసి ఫెయిలైన శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

విశేషం ఏంటంటే.. ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్న రాజ్‌ను, తొలి సినిమాతో మెప్పించలేకపోయిన శ్రీనివాస్‌ను నమ్మి అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చాడు. ఇంతకుముందు రాజ్‌ను ‘ఉయ్యాల జంపాల’తో హీరోగా నిలబెట్టింది నాగార్జునే. మళ్లీ ఆయనే అతణ్ని రక్షించడానికి ముందుకు వచ్చాడు. ఐతే ఒకప్పట్టా నాగ్ జడ్జిమెంట్ పని చేయట్లేదని.. ఆయన సినిమాలు, కొడుకుల సినిమాలను బట్టే తెలుస్తోంది. మరి నాగ్.. రాజ్‌కు సక్సెస్ అందించగలడా?