అభిమాని హత్యలో సినిమాని మించిన డ్రామా

పక్క రాష్ట్రం కర్ణాటకలో మర్డర్ కేసులో ఇరుక్కున్న స్టార్ హీరో దర్శన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోలీసులు చేస్తున్న విచారణలో వెలికితీస్తున్న నిజాలు సినిమా డ్రామాని మించిన తరహాలో ఉన్నాయట.

నటి పవిత్ర గౌడతో అనధికార బంధం గురించి కామెంట్లు చేసిన రేణుకా స్వామి అనే వ్యక్తిని హత్య చేయించిన అభియోగం దర్శన్ మీదుంది. చిత్రదుర్గకు చెందిన ఫ్యాన్ అసోసియేషన్ కార్యదర్శి రాఘవేంద్రను ఈ పనికి దర్శన్ పురమాయించినట్టు ప్రాధమికంగా తేల్చారు. ఒక షెడ్డుకి తీసుకెళ్లి గోడకేసి బాదడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్టుగా వచ్చిన రిపోర్టులు మీడియాలో హైలైట్ అవుతున్నాయి.

ఇంకోపక్క దర్శన్ వీరాభిమానులు కొందరు అతన్ని వెనకేసుకొచ్చేందుకు ఈ హత్యోదంతాన్ని సమర్ధించడం మానవ హక్కుల సంఘాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మీడియా వ్యవహరిస్తున్న తీరు పట్ల ఫ్యాన్స్ విపరీతంగా స్పందిస్తుండగా దానికి ధీటుగానే ఛానల్స్ స్పందిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

మరీ విచిత్రంగా కొందరు ఏదో తొందరపాటులో దర్శన్ తప్పు చేసి ఉంటాడు తప్ప కావాలని కాదని జాలి సూక్తులు వల్లెవేయడం పట్ల కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. కోర్టు దోషిగా నిర్ణయించేవరకు ఓపిక పట్టమని అడిగితే బాగుంటుంది కానీ ఇలా సపోర్ట్ చేయడం ఏమిటని విమర్శిస్తున్నాయి.

దర్శన్ కు మొదటి భార్యకు మధ్య అడ్డం రావొద్దని పవిత్ర గౌడని ఉద్దేశించి రేణుక స్వామి సోషల్ మీడియాలో చేసిన కామెంట్లే ఇంత దూరం తీసుకొచ్చాయి. నిజానికి ఇతను ఈ ముగ్గురిలో ఎవరిని ప్రత్యక్షంగా కలిసింది లేదు.

ట్విస్ట్ ఏంటంటే రేణుక స్వామి ఇదే దర్శన్ కు వీరాభిమాని. అందుకే తన హీరో కుటుంబంలో కలతలు రాకూడదనే ఉద్దేశంతో పవిత్ర మీద ఆన్ లైన్ లో వ్యాఖ్యలు చేశాడు. తీరా చూస్తే ఏకంగా దర్శన్ వల్లే ఈ లోకంలో లేకుండా పోయాడని సన్నిహితులు వాపోతున్నారు. మెల్లగా రాజకీయ రంగు పులుముకుంటున్న దర్శన్ కేసు ఏకంగా సిఎం మీదే ఒత్తిడి తెస్తే ఆయన సీరియస్ అయ్యారని టాక్.