మహేష్ బాబు వందసార్లు చూసిన సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు బిజీ గురించి తెలిసిందే. షూటింగులు, ఫ్యామిలీతో సమయం తప్ప మీరో ప్రపంచం ఉండదు. వీలైతే బాగున్న కొత్త సినిమాలు చూడటం అలవాటు. ఎంత నచ్చినవి అయినా సరే మహా అయితే ఒకటి రెండు సార్లు చూస్తారు తప్పించి అంతకన్నా ఎక్కువ సాధ్యం కాకపోవచ్చు.

కానీ మహేష్ విపరీతంగా ప్రేమించి వందసార్లు చూసిన మూవీ ఒకటి ఉంది. అదే మోసగాళ్లకు మోసగాడు. కృష్ణ హీరోగా వచ్చిన ఈ కౌబాయ్ డ్రామా ఒక ట్రెండ్ సెట్టర్. అప్పట్లో ఎందరో యూత్ హీరోలు ఈ జానర్ ట్రై చేశారు కానీ నటశేఖర సృష్టించిన రికార్డులు మాత్రం టచ్ చేయలేకపోయారు.

అంతగా మోసగాళ్లకు మోసగాడు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆ కారణంగానే ట్రెండ్ లేని టైంలో రిస్క్ చేసి మరీ మహేష్ బాబు ఫ్యాన్స్ కోరిక మేరకు టక్కరి దొంగ చేశాడు.

ఆశించిన ఫలితం దక్కకపోయినా దర్శకుడు జయంత్ సి పరాంజీ తీసిన విధానం, హాలీవుడ్ స్టాండర్డ్, అన్నింటికి మించి మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, తీసుకున్న రిస్క్ ఎప్పటికీ మర్చిపోలేని స్పెషల్ మూవీగా మార్చాయి. ఇదంతా మోసగాళ్లకు మోసగాడు ప్రభావమే. ఈ సంగతి నిన్న జరిగిన హరోంహర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ సుధీర్ బాబుల మధ్య జరిగిన ఆడియో క్లిప్ ద్వారా బయటపెట్టారు.

ముందు మహేషే గెస్ట్ గా వస్తాడేమో అనుకుంటే కేవలం ఫోన్ ద్వారా వినిపించడానికి పరిమితమయ్యారు. అడవి శేష్, విశ్వక్ సేన్ అతిథులుగా వచ్చిన హరోం హర ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ సందర్భంగా నిజం తనకు స్పెషల్ మూవీ అని చెప్పిన మహేష్ గన్స్ వాడటం గురించి కూడా ప్రస్తావించాడు.

సుధీర్ బాబు తొలి చిత్రం నుంచి సపోర్ట్ గా ఉంటూ వస్తున్న మహేష్ ఈసారి హరోంహర కంటెంట్ చూసి ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. కృష్ణ గారు ఉంటే ఇప్పుడీ సుబ్రహ్మణ్యం పాత్రను చూసి ఎంతో సంతోషించేవారని సుధీర్ బాబు చెప్పడం తన నమ్మకాన్ని చూపిస్తోంది.