‘రంగీలా’లో నాగ్, రజినీ, శ్రీదేవి!

రంగీలా సినిమాలో నాగార్జున, రజినీకాంత్, శ్రీదేవి ఏంటి? అని ఆశ్చర్యం కలుగుతోందా? రామ్ గోపాల్ వర్మ ముందు అనుకున్న ప్రకారం అయితే ఆ సినిమాలో ఆ ముగ్గురే నటించాల్సిందట. ప్రధాన పాత్రల్ని ఈ ముగ్గురి దృష్టిలో ఉంచుకునే తీర్చిదిద్దాడట. ఈ విషయాన్ని ‘రంగీలా’ ఒరిజినల్ హీరోయిన్ ఊర్మిళనే స్వయంగా వెల్లడించడం విశేషం. ఈ లెజెండరీ మూవీ విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందమంతా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది.

ఓ ఇంటర్వ్యూలో ఊర్మిళ మాట్లాడుతూ.. వర్మ దృష్టిలో కథానాయికగా ముందు తాను లేనని.. ఆయన ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవిని ‘రంగీలా’గా చూపించాలని వర్మ అనుకున్నాడని వెల్లడించింది. అలాగే ఆమిర్ ఖాన్ చేసిన మున్నా పాత్రలో నాగార్జునను, జాకీష్రాఫ్ చేసిన సినీ హీరో పాత్రలో రజినీ కాంత్‌ను పెట్టాలని ఆయన అనుకున్నారని.. ఐతే అనుకోకుండా తాను ఆమిర్ ఖాన్, జాకీష్రాఫ్ ఆ సినిమాలోకి వచ్చామని ఆమె వెల్లడించింది. ‘శివ’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించిన వర్మ.. ‘రంగీలా’తో స్ట్రెయిట్ హిందీ సినిమా తీసి అక్కడా జెండా పాతాడు.

శ్రీదేవి అంటే వర్మకు ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ఆమెను ‘రంగీలా’లా చూపించి ఉంటే కూడా బాగుండేదేమో కానీ.. ఈ సినిమాతో ఊర్మిళ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్క సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాకు అలాంటి ఫ్రెష్ హీరోయిన్ అయితేనే ఇలాంటి ఔట్ పుట్ వచ్చేదేమో. ‘రంగీలా’ కథాకథనాలు, సంగీతం, హీరోయిన్ అందాలు.. ఆమిర్, జాకీల నటన.. ఇలా అన్నీ హైలైటే అయ్యాయి. ఈ సినిమా తర్వాత వర్మ వెనుదిరిగి చూసుకోలేదు. దశాబ్దం పాటు బాలీవుడ్‌ను ఏలాడు.