క్రేజీ రూమర్.. పిఠాపురంలో ప్రి రిలీజ్ ఈవెంట్

పిఠాపురం.. కొన్ని వారాలుగా ఈ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంచుకున్న నియోజకవర్గం కావడమే అందుక్కారణం. ఆ మేరకు ప్రకటన వచ్చిన తొలి రోజు నుంచి పిఠాపురం పేరు సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతూ వస్తోంది. అక్కడ పవన్ ప్రచారానికి వెళ్లిన ప్రతిసారీ జనం బ్రహ్మరథం పట్టారు. ఆ నియోజకవర్గం నుంచి పవన్ భారీ మెజారిటీతో గెలవబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

తాజాగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. పవన్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే ఎన్నికైతే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని అంచనా వేస్తున్నారు. తొలిసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి పవన్ చేయాల్సిందల్లా చేస్తారనడంలో సందేహం లేదు.

ఐతే ఇంకా ఫలితాల ప్రకటన రాకముందే పిఠాపురానికి హైప్ క్రియేట్ అయి.. అక్కడ ఓ పేరున్న సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రమే.. మనమే. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాను నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ పవన్‌కు సన్నిహితుడు. ఇక ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్‌ను పిఠాపురంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నారని.. ఎన్నికల ఫలితాలు రాగానే తర్వాతి రోజే అక్కడ ఈవెంట్ చేస్తే మంచి హైప్ కూడా వస్తుందని.. ఇందుకోసం అనుమతులు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ క్రేజీ రూమర్లలో వాస్తవమెంతో చూడాలి.