పూజా హెగ్డే.. ఎట్టకేలకు ఓ పెద్ద ఛాన్స్

తెలుగులో కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది బాలీవుడ్ భామ పూజా హెగ్డే. తొలి రెండు చిత్రాలు ముకుంద, ఒక లైలా కోసం ఫ్లాప్ అయినా.. మధ్యలో రెండేళ్లు గ్యాప్ వచ్చినా.. రీఎంట్రీలో చేసిన ‘దువ్వాడ జగన్నాథం’ కూడా సరిగా ఆడకపోయినా.. ఆమె దశ తిరిగింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్.. ఇలా పెద్ద పెద్ద హీరోల సరసన కథానాయికగా అవకాశాలు అందుకుంది.

కానీ వరుస పరాజయాలు ఎలాంటి హీరోయిన్‌‌కైనా బ్రేకులు వేస్తాయనడానికి పూజా ఉదంతమే ఉదాహరణ. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్.. ఇలా వరుసగా మూడు డిజాస్టర్లు పడడంతో పూజా మీద ఇండస్ట్రీలో బాగా నెెగెటివిటీ పెరిగిపోయింది. దీంతో సడెన్‌గా ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి. దీంతో మిడ్ రేంజ్ సినిమాల్లో చేయడానికి కూడా రెడీ అయింది. అయినా ఛాన్సుల్లేవు.

ఇలాంటి టైంలో దక్షిణాదిన మళ్లీ ఆమెకో పెద్ద అవకాశం వచ్చింది. తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య సరసన పూజా సినిమా చేయబోతోంది. సూర్య హీరోగా ‘పిజ్జా’; ‘జిగర్ తండ’, ‘పేట’ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ సినిమా తీయబోతున్నాడు. గత ఏడాది ‘జిగర్ తండ డబులెక్స్’తో పర్వాలేదనిపించిన కార్తీక్.. ఇటీవలే సూర్యతో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి కథానాయికగా పూజాను ఖరారు చేస్తూ తాజాగా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. కెరీర్లో ఈ టైంలో సూర్య సరసన ఛాన్స్ అంటే పూజా కెరీర్ మళ్లీ టర్న్ అవుతున్నట్లే.

ఇందులో మలయాళ లెజెండరీ నటులు జయరాం, జోజు జార్జ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ ఆస్థాన సంగీత దర్శకుడైన సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మరిందరు పేరున్న టెక్నీషియన్లు పని చేస్తున్నారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.