సూర్య త‌ప్పు చేశాడు.. మ‌న్నిస్తున్నాం

వైద్య విద్యలో ప్రవేశం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల కిందట మొదలుపెట్టిన ‘నీట్’ పరీక్షను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న త‌మిళ హీరో సూర్య.. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలోనూ ఈ పరీక్షను నిర్వహించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సూర్య కేంద్ర ప్రభుత్వంతో పాటు కోర్టుల తీరును కూడా ప్రశ్నిస్తూ ఘాటైన వ్యాఖ్యలతో ఒక స్టేట్మెంట్ ఇవ్వ‌డం దుమారం రేపింది.‘నీట్’ వాయిదాకు సంబంధించిన పిటిషన్లపై విచారణను న్యాయమూర్తులు కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారని.. మరి విద్యార్థులు మాత్రం ఏ భయం లేకుండా పరీక్షలు రాయాలని ఎలా చెప్పారని సూర్య ప్రశ్నించడం మ‌ద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎం సుబ్రహ్మణ్యం ఆగ్ర‌హం తెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని ఆయన మద్రాసు హైకోర్టును కోరారు.

ఐతే ఈ దిశగా ప్రొసీడింగ్స్ కూడా ఏమీ మొదలు కాలేదు. సూర్యను ఈసారికి మద్రాస్ హైకోర్టు మన్నించి వదిలేసింది. ఐతే కోర్టుల గురించి అతడి వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని హైకోర్టు స్పష్టం చేసింది. సూర్య అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని.. అవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.

న్యాయవ్యవస్థ ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తుందని.. కరోనా టైంలో కూడా న్యాయవ్యవస్థ తన బాధ్యత మరువలేదని.. అలాంటి వ్యవస్థను తక్కువ చేసిన మాట్లాడటం తగదని హైకోర్టు పేర్కొంది. ఐతే సూర్య స్టేట్మెంట్ విషయంలో జనాల నుంచి పూర్తి మద్దతు లభించిన నేపథ్యంలోనే హైకోర్టు చర్యలు చేపట్టలేదని భావిస్తున్నారు. నీట్ పరీక్ష నేపథ్యంలో తమిళనాట ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ పరీక్ష పట్ల ఆ రాష్ట్రంలో వ్యతిరేకత ఇంకా పెరిగిపోయింది.