బాలయ్య మీద వివాదాలు: హీరో నిర్మాత క్లారిటీ

మొన్న జరిగిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెండు విషయాలు సోషల్ మీడియాలో బాగా హైలైటయ్యాయి. ఒకటి బాలకృష్ణ కూర్చున్న కుర్చీ కింద నీళ్ల బాటిల్ తో పాటు మందు సీసా ఉన్నట్టు వచ్చిన వీడియో. రెండోది వేడుక చివర్లో స్టేజి మీద హీరోయిన్ అంజలిని బాలయ్య చిన్నగా తోసిన సంఘటన మరొకటి. వీటి ముందు వెనుక ఏం జరిగిందనేది చూసుకోకుండా కేవలం కొద్ది సెకండ్లు మాత్రమే ప్రచారంకి తేవడంతో ఇది కాస్తా దూరం వెళ్లిపోయింది. ఇతర బాషల కొన్ని మీడియా హ్యాండిల్స్ సైతం చెక్ చేసుకోకుండా వాటిని పోస్ట్ చేయడంతో పెద్ద చర్చ జరిగింది.

ఈ వివాదాల గురించి విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. వీడియోలో చూపించిన మందు సీసా కేవలం సిజిలో ఎవరో దురుద్దేశంతో సృష్టించిందని, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న తమకు ఉన్నది లేనిది స్పష్టంగా తెలుసని కుండ బద్దలు కొట్టారు. తమ సినిమా రెండో భాగం సిజికి వీళ్ళే పని చేయబోతున్నారని విశ్వక్ చురక వేశాడు. అంజలిని పక్కకు తోసేయడం జరగలేదని, అంత శబ్దంలో జరగమని చెబితే ఆమెకు వినిపించలేదని, చనువుతో పక్కకు జరిపారు తప్పించి వేరే ఏ ఉద్దేశం లేదని అన్నారు. తర్వాత ఇద్దరు హై ఫై అంటూ చేతులతో చప్పట్లు  చరచడం చూపించలేదన్నారు.

ఇదంతా అభిమానులకు సంతోషం కలిగించే వ్యవహారమే అయినా నిన్న ఆ వీడియోలు చేసిన రచ్చ మాత్రం మామూలుది కాదు. ఇక సెన్సార్ గురించి మాట్లాడుతూ కేవలం మూడు చోట్ల మాత్రమే అభ్యంతరం అనిపించే పదాలు ఉంటాయని అవి కూడా డొమెస్టిక్ కాపీలో ఇబ్బందికరంగా ఉండవని విశ్వక్ సేన్ అన్నాడు. ముందు యూత్ మాత్రమే టార్గెట్ అవుతారు అనుకుంటే నిన్న ఫైనల్ కాపీ చూశాక చిన్న పిల్లలు సైతం వచ్చి ఎంజాయ్ చేసేలా ఉంటుందని, అలా అనిపించకపోతే తర్వాత ఇదే ప్రెస్ మీట్లలో నన్ను నిలదీయొచ్చని విశ్వక్ సేన్ చెప్పడం విశేషం. ఇంకొద్ది గంటల్లో షోలు పడబోతున్నాయి.