ధృవ 2 కొత్త విలన్ దొరికాడు

అదేంటి రామ్ చరణ్ ఎక్కడా చెప్పనిది ధృవ 2 ఎక్కడ నుంచి ఊడిపడ్డాడని ఆశ్చర్యపోకండి. ధృవ ఒరిజినల్ వెర్షన్ తని ఒరువన్ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితో గాడ్ ఫాదర్ చేసిన మోహన రాజా దీనికి దర్శకుడు. తమిళంలో బాక్సాఫీస్ ఫలితం చూశాక తెలుగు రీమేక్ గురించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అప్పటిదాకా ఖరారుగా చెప్పలేం. సెకండ్ పార్ట్ లోనూ జయం రవినే హీరో. మొదటి భాగం రెండు భాషల్లో అరవింద్ స్వామి విలన్ గా నటించాడు. అయితే ఆ పాత్ర చివర్లో చనిపోవడంతో ఇప్పుడు కొనసాగింపులోకి తీసుకోవడం సాధ్యపడదు.

అందుకే మోహన్ రాజా కొత్త విలన్ కోసం చేసిన వేట కొలిక్కి వచ్చినట్టు సమాచారం. బిగ్ బి వారసుడు అభిషేక్ బచ్చన్ ఈ పాత్ర చేయడానికి స్పందించినట్టు తెలిసింది. ఇటీవలే చెన్నైలో ఫోటో షూట్ చేసి లుక్స్ సంతృప్తికరంగా రావడంతో ఓకే అనుకున్నట్టు తెలిసింది. అభిషేక్ కు కథ విపరీతంగా నచ్చేసిందని అంటున్నారు. తండ్రి అమితాబ్ బచ్చన్ సౌత్ లో సైరా, కల్కి 2898 ఏడి లాంటి భారీ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్న టైంలో అభిషేక్ కనక ధృవ 2 లాంటి యాక్షన్ మూవీతో విలన్ గా ఎంట్రీ ఇస్తే సౌత్ దర్శకులకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ప్రతినాయకుడు దొరికినట్టే.

ఇక మన విషయానికి వస్తే ధృవ 2 కావాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తని ఒరువన్ 2 కనక హిట్ అయితే తెలుగులోనూ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అప్పుడంటే డేట్ల సమస్య వల్ల ఆ ఛాన్స్ సురేందర్ రెడ్డికి దక్కింది కానీ ఈసారి మాత్రం రామ్ చరణ్ ఒప్పుకుంటే మోహన్ రాజానే ఆ బాధ్యత తీసుకోవచ్చు. ఇప్పుడీ సీక్వెల్ కి కూడా హిప్ హాప్ తమిజానే సంగీతం సమకూరుస్తున్నాడు. వీలైతే ఈ ఏడాది లేదా వచ్చే సంవత్సరం రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాలో నయనతారనే హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్నట్టు తెలిసింది.