‘రంగ్ దె’ను టికెట్ కొనే చూడాలి.. కానీ ట్విస్టేంటంటే?

థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్న చాలా సినిమాల్ని ఇప్పటికే ఓటీటీల్లో వదిలేశారు. మున్ముందు ఈ బాటలో మరిన్ని సినిమాలు పయనించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ మధ్య నితిన్ సినిమా ‘రంగ్ దె’ టీజర్ రిలీజ్ చేసినపుడు సంక్రాంతి విడుదల గురించి సంకేతాలిచ్చారు.

వచ్చే సంక్రాంతికి పెద్ద సినిమాలేవీ వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో ‘రంగ్ దె’ను రిలీజ్ చేసి పండగ చేసుకుందామని అనుకున్నారు. కానీ అప్పటికి కూడా థియేటర్లు మామూలుగా నడిచే అవకాశాలు కనిపించడం లేదు. ఈ మధ్య ‘టెనెట్’ అనే భారీ సినిమాను రిలీజ్ చేస్తే కోవిడ్ నుంచి కొంచెం కోలుకున్న దేశాల్లో సైతం ఆశించిన వసూళ్లు లేవు. జనాలు థియేటర్లకు రావడానికి ఇష్టపడట్లేదని అర్థమైంది. మన దగ్గర కరోనా తీవ్రత ఎంతకీ తగ్గట్లేదు. సంక్రాంతి సమయానికి కూడా పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో ‘రంగ్ దె’ టీం ఆలోచన కూడా మారుతోందని.. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేసేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఒక పేరున్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో డీల్ కూడా అయిపోయిందని సమాచారం. ఐతే ఈ చిత్రాన్ని ఇంతకుముందు రిలీజ్ చేసిన సినిమాల తరహాలో మాత్రం ఓటీటీల్లో స్ట్రీమ్ చేయరట. సబ్‌స్కిప్షన్ ఉన్న ఓటీటీలోనే పే పర్ వ్యూ పెట్టబోతున్నట్లు చెబుతున్నారు. రామ్ గోపాల్ వర్మ పెట్టినట్లే దీనికి టికెట్ రేటు పెడతారట.

ఐతే వర్మ సినిమాలు సబ్‌స్క్రిప్షన్ లేని ఫ్లాట్‌ఫామ్‌లో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజయ్యాయి. కానీ ‘రంగ్ దె’ ఆల్రెడీ ప్రేక్షకులు సబ్‌స్క్రిప్షన్ కడుతున్న ఓటీటీలో రిలీజవుతున్న నేపథ్యంలో దీనికి టికెట్ రేట్ తక్కువే పెడతారట. ‘వి’ సినిమాను మంచి రేటు పెట్టి కొన్న అమేజాన్‌కు అంతిమంగా ఆశించిన ప్రయోజనం రాలేదు. అమేజాన్ వాళ్లు క్రేజున్న కొత్త సినిమాలకు ‘పే పర్ వ్యూ’ పద్ధతిని ప్రవేశపెడతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘వి’కే అలా ఉండొచ్చన్నారు కానీ.. అదేమీ లేకపోయింది. బహుశా ‘రంగ్ దె’ను ఆ సంస్థే సొంతం చేసుకుని ‘పే పర్ వ్యూ’తో రిలీజ్ చేస్తుందేమో చూడాలి.