గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న నమ్మకంతో, దిల్ రాజు మీద గౌరవంతో ఎంత అసహనంగా అనిపిస్తున్నా ఓపిగ్గా భరిస్తూ వచ్చాడు. ఫ్యాన్స్ కి ఆ అవసరం లేదు కాబట్టి ఎప్పటికప్పుడు తమ నిరసనను పలు రూపాల్లో నిర్మాణ సంస్థ, దర్శకుడు మీద చూపిస్తూనే ఉన్నారు. ఈ క్షణానికి రిలీజ్ డేట్ ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆ మధ్య అక్టోబర్ లో రావొచ్చనే రీతిలో సంకేతాలు ఇచ్చారు కానీ క్రమంగా ఆ సూచనలు తగ్గిపోయాయి. భారతీయుడు 2 సంగతి తేలనిధే స్పష్టత వచ్చే ఛాన్స్ లేదు.

ఇక అసలు పాయింట్ కు వస్తే ఆర్సి 16 కోసం బుచ్చిబాబు సనా స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతూనే ఉన్నా చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేని నిస్సహాయత. జూన్ లేదా జూలై నుంచి సెట్స్ పైకి వెళ్తుందని మెగా కాంపౌండ్ టాక్. సుకుమార్ డైరెక్షన్ లో ఆర్సి 17 ప్రకటించి నెలలు గడిచిపోయాయి. ఆగస్ట్ పదిహేను తర్వాత పుష్ప 2 ది రూల్ నుంచి సుకుమార్ ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత దృష్టి పెట్టాల్సింది చరణ్ మూవీ మీదే. గేమ్ ఛేంజర్ జాప్యం ఇలాగే కొనసాగితే గురు శిష్యులతో మెగా పవర్ స్టార్ ఒకేసారి చేయాల్సి రావొచ్చు.

జూనియర్ ఎన్టీఆర్ లాగా రామ్ చరణ్ వేగం పెంచాలని సగటు ఫ్యాన్స్ కోరిక. తారక్ కొంత లేట్ అయినా సరే ఒకేసారి దేవర, వార్ 2ల షూట్స్ లో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ తర్వాత దేవర 2 ఉండనే ఉంది. సో మూడేళ్ల డైరీని పక్కా ప్లాన్ తో లాక్ చేసుకున్నాడు జూనియర్. కానీ చరణ్ పరిస్థితి అలా లేదు. అందుకే ఆచితూచి అడుగులేయడం తప్పడం లేదు. కనీసం రెండేళ్లకు ఒకటైనా రిలీజయ్యేలా చూడాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నా చరణ్ అలా చేయలేని వ్యూహంలో చిక్కుకుంటున్నాడు. వేసవి సెలవుల తర్వాతయినా స్పీడ్ పెంచక తప్పదు మరి.