అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం నంద్యాల వెళ్లొచ్చిన అల్లు అర్జున్ వ్యవహారం మాత్రం అంత సులభంగా మాసిపోయేలా లేదు. మావాడు పరాయివాడు అంటూ కొద్దిరోజుల క్రితం నాగబాబు ఎవరినో ఉద్దేశించి పెట్టిన ట్వీట్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఎంత దూరం వెళ్లిందంటే ఆయన ఏకంగా నిన్న తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ని డీ యాక్టివేట్ చేసుకునేదాకా. జనసేన మంచి ఊపుమీదున్న టైంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య ఇలా చేయడం ఆశ్చర్యమే కాదు అంతు చిక్కని అనూహ్యం కూడా.

జనసేనకు, మావయ్య పవన్ కు ఎప్పుడూ మద్దతు ఉంటుందని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రచారం చివరి రోజు వెళ్లడమే ఇంత రచ్చకు దారి తీసింది. పైగా అతని స్నేహితుడు, నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్ప రవిచంద్రరెడ్డి పవన్, నాగబాబు మీద గతంలో, వర్తమానంలో చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ లో మరింత నిప్పుని రాజేశాయి. ఒకవేళ నాగబాబు అకౌంట్ తీసేయకుండా ఎవరూ అపార్థం చేసుకోవద్దని చెప్పినా రగడ ఇక్కడితో ఆగేది. కానీ అలా చెప్పకపోవడంతో విషయం ముదిరి పాకాన పడింది. పుష్ప 2 ది రూల్ విడుదల టైంలో దీని ప్రభావం ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి.

ఇప్పుడీ డ్యామేజ్ రిపేర్ చేయడానికి ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి. నాగబాబా లేక అల్లు అరవిందా లేక పార్టీలో కీలక సభ్యులా ముందు ఆ అపార్థాలు తగ్గించే దిశగా ఏదైనా చర్యలు తీసుకుంటే తప్ప అంత సులభంగా చల్లారేలా లేదు. ఈ ఇష్యూ వల్ల పుష్ప 2 కొచ్చిన ఇబ్బంది కానీ నష్టం కానీ ఉండకపోవచ్చు. కానీ నానుస్తూ పోతే భవిష్యత్ లో జరిగే వేరే పరిణామాలకు దీనికి ముడిపెట్టే రిస్క్ లేకపోలేదు. బన్నీ పర్యటన మొదలు నాగబాబు ట్వీట్ దాకా జరిగిన నాటకీయతని లోతుగా అర్థం చేసుకునే పరిపక్వత అధిక శాతం అభిమానుల్లో ఉండదు. ఈ వివాదం సద్దుమణిగితే తప్ప శుభం కార్డు పడదు.