59 నెంబర్ మీద చరణ్ అభిమానుల కోపం

అదేంటి ఒక సంఖ్య మీద హీరో ఫ్యాన్స్ కి కోపం రావడం ఏమిటనుకుంటున్నారా. దానికి సహేతుకమైన కారణమే ఉంది లెండి. నిన్న ప్రకటించిన విజయ్ దేవరకొండ – రవికిరణ్ కోలా కాంబో మూవీ దిల్ రాజు గారి ఎస్విసి సంస్థకు 59వ సినిమా. మూడేళ్ళకు ముందు గేమ్ ఛేంజర్ అనౌన్స్ చేసినప్పుడు అది తమ బ్యానర్ 50వ చిత్రమని అప్పట్లో టీమ్ గర్వంగా ప్రకటించింది. తీరా చూస్తే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అప్పన్న, రామ్ నందన్ గా మెగా పవర్ స్టార్ వెండితెర దర్శనం మాత్రం జరగడం లేదని అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అందుకే ఈ ఆగ్రహావేశం.

అంటే గేమ్ ఛేంజర్ అనౌన్స్ చేశాక మరో తొమ్మిది సినిమాల దాకా వచ్చిన దిల్ రాజు అంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆయన చేతుల్లో ఏం లేదన్నది ఓపెన్ సీక్రెట్. దర్శకుడు శంకర్ ఏదీ తేల్చడం లేదు. ఒకపక్క దీని షూటింగ్ చేస్తూనే ఇంకోవైపు భారతీయుడు 2కి సంబంధించిన రిలీజ్ డేట్ వ్యవహారాలు చక్కదిద్దే పనిలో ఉన్నారు. దీని వల్ల రెండింటికి నష్టమే జరుగుతోంది. ముందు జూన్ అనుకున్న ఇండియన్ 2 ఇప్పుడు జూలైకి వెళ్ళింది. అప్పుడూ వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఏది జరగాలన్నా అంతా శంకరే కరుణ చూపాలి.

మొన్నటిదాకా అక్టోబర్ మీద నమ్మకం పెట్టుకున్న చరణ్ ఫ్యాన్స్ కు మెల్లగా ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఆ సూచనలు తగ్గుముఖం పట్టాయి. అలా అని జనవరి మీద ఆశలు పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే చిరంజీవి విశ్వంభర ఆల్రెడీ లాక్ అయ్యుంది. పక్కా ప్లానింగ్ తో చేస్తున్నారు. ఒకవేళ ఇదేమైనా మిస్ అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుని దించే అవకాశాలు కొట్టి పారేయలేం. అదే జరిగితే గేమ్ ఛేంజర్ మళ్ళీ వేసవికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంతదాకా వెళ్లకూడదనే దిల్ రాజు సంకల్పం. చివరికి ఏమవుతుందో మాత్రం విక్రమార్కుడు కూడా చెప్పలేని భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది.