నీల్ తప్ప ఎవరూ చెప్పలేని గుట్టు

గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ సినిమాకు వర్క్ చేస్తున్నారో ఇప్పటిదాకా సస్పెన్స్ గానే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో మొదలవుతుందనే వార్త ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులను ఖంగారు పెట్టింది. ఎందుకంటే వేసవి కాగానే సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం సెట్స్ పైకి వెళ్తుందని ఎదురు చూస్తున్న టైంలో ఇలాంటి న్యూస్ షాకే మరి. నీల్ ఒక్కసారి ఒకే సినిమా మీద ఫోకస్ పెడతాడు తప్పించి రెండింటిని సమాంతరంగా తీసే రకం కాదు.

సో రైట్ సైడ్ ప్రభాస్, లెఫ్ట్ సైడ్ తారక్, మధ్యలో నీల్ అన్నట్టు ఉంది పరిస్థితి. ఎవరిది ముందు ఉంటుందనే గుట్టు ఖచ్చితంగా తెలిసింది ఆయనకు మాత్రమే. ఆ మధ్య గోట్ లైఫ్ ఆడుజీవితం ప్రమోషన్లలో పృథ్విరాజ్ సుకుమార్ మాట్లాడుతూ సలార్ 2 సమ్మర్ లోనే ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రాక్టికల్ గా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో నీల్ తో చేతులు కలపడం అంత సులభం కాదు. ఒకపక్క వార్ 2 మంచి స్వింగ్ లో ఉంది. దేవర బ్యాలన్స్ తో పాటు దాని ప్రమోషన్లు అయ్యేదాకా అక్టోబర్ వరకు దానికే కేటాయించాలి. దేవర 2 ని ఎక్కువ ఆలస్యం చేయడానికి లేదు.

అలా అని తారక్ నీల్ ప్రాజెక్టు మరీ ఆలస్యమవుతుందని కాదు. ఇది కెజిఎఫ్, సలార్ తరహాలో ఒకే ప్రాంతంలో జరిగే కథలా ఉండదట. వివిధ దేశాల్లో, ఊహకందని మలుపులతో విభిన్న మలుపులతో చాలా డిఫరెంట్ గా ఉంటుందట. మరి ఏది ముందు ఏది వెనుక అనేది తేలాలంటే ఏదో ఒక సందర్భంలో ప్రశాంత్ నీల్ ఓపెన్ కావాలి. ఇవి ఒక ఎత్తయితే కెజిఎఫ్ 3 కూడా లైన్ లో ఉంది. కాకపోతే దీని గురించి టెన్షన్ అక్కర్లేదు. యష్ ముందు టాక్సిక్ పూర్తి చేసుకుని వచ్చే లోపు ఏడాదిన్నర పైనే పడుతుంది. ఇంకో రెండేళ్ల తర్వాత కెజిఎఫ్ 3 మొదలవొచ్చు కానీ ముందైతే ఏది మొదలో చెప్పేస్తే బెటర్.