కోలీవుడ్లో గొడవ ముదురుతోంది

మన దగ్గరైతే కొత్త సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేస్తుంటే థియేటర్ల యాజమాన్యాల నుంచి పెద్దగా అభ్యంతరాలేమీ ఎదురవుతున్నట్లు వార్తలేమీ రాలేదు. హిందీ సినిమాల రిలీజ్ విషయంలో పీవీఆర్, ఐనాక్స్ లాంటి సంస్థలు తమ అసంతృప్తిని వెళ్లగక్కి ఊరుకున్నాయి. ఐతే కోలీవుడ్లో మాత్రం పరిస్థితి భిన్నం. కొత్త చిత్రాలను థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయడం పట్ల అక్కడ థియేటర్ల యాజమాన్యాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

దీని మీద నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యాల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుతోంది. ముందు తన భార్య జ్యోతిక నటించిన ‘పొన్ మగల్ వందాల్’ చిత్రాన్ని సూర్య అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయాలనుకున్నపుడు థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా స్పందించాయి. ఇలా చేస్తే సూర్య సినిమాలు వేటినీ థియేటర్లలో రిలీజ్ కానివ్వమని హెచ్చరించాయి. కరోనా టైంలో కూడా కొందరు ఈ విషయమై బయటికొచ్చి నిరసన ప్రదర్శనలు కూడా చేశారు.

కానీ తాను నిర్మించిన సినిమాను ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది నిర్మాతగా తన ఇష్టమని సూర్య తేల్చి చెప్పేసి ‘పొన్ మగల్ వందాల్’ను ప్రైమ్‌లో రిలీజ్ చేశాడు. అంతటితో ఆగకుండా తన చిత్రం ‘సూరారై పొట్రు’ను సైతం ప్రైమ్‌ వాళ్లకు ఇచ్చేసి సంచలనం రేపాడు. మరోవైపు విజయ్ సేతుపతి కొత్త సినిమా సైతం డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఇంకొన్ని తమిళ సినిమాలు ఈ బాటలోకి వచ్చేసరికి థియేటర్ల యాజమాన్యాలకు మండిపోయింది. వాళ్లు మళ్లీ నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఐతే ప్రొడ్యూసర్ల సంఘం అధ్యక్షుడైన సీనియర్ దర్శకుడు భారతీరాజా.. గట్టిగా బదులిచ్చాడు.

థియేటర్ల యజమానులు నిర్మాతలను ఎలా డిక్టేట్ చేస్తారని ప్రశ్నించాడు. తమ సినిమాను ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది నిర్మాత ఇష్టమని తేల్చేశారాయన. ఐతే అటు నుంచి థియేటర్ల యాజమాన్యాల తరఫున చెన్నైలోని ప్రఖ్యాత వెట్రి థియేటర్ యజమాని రాకేష్ గౌతమన్ ఈ కామెంట్లపై మరింత సీరియస్‌గా స్పందించాడు.

నిర్మాతలు ఇకపై అన్ని సినిమాలనూ ఓటీటీల్లో రిలీజ్ చేసుకోవచ్చని, థియేటర్లు ఎలాగూ ప్రైమ్ ఏరియాల్లో ఉంటాయి కాబట్టి సినిమాలు ప్రదర్శించడం కంటే ఆ స్థలాన్ని రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగిస్తే తమకు బోలెడంత ఆదాయం వస్తుందని.. తమకు కోల్పోయేదేమీ లేదని తేల్చేశాడతను. ఇలా వాదోపవాదాలతో సాగుతున్న నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వ్యవహారం ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.