మహేష్ ఫ్యాన్స్ మిస్సవుతున్న పాయింట్

ఇటీవలే జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ గురించి చేసిన ప్రస్తావన మహేష్ ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగించడం సోషల్ మీడియా ట్రెండ్స్ లో కనిపిస్తోంది. సంస్కారం గురించి చెప్పడాన్ని ఇంకో కోణంలో అర్థం చేసుకున్న కృష్ణ, మహేష్ అభిమానులు ఎక్స్ వేదికగా రకరకాల రూపాల్లో నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. తప్పొప్పుల సంగతి తేల్చడానికి ముందు గతంలో జరిగినవి ఒకసారి తొంగి చూడాలి. 1983లోతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ పాలన విధానాలు నచ్చక కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరడం అందరికీ తెలిసిన విషయమే .

ఆ క్రమంలో కొన్ని రాజకీయ వ్యంగ్య చిత్రాలు నిర్మించారు. గండిపేట రహస్యం, సాహసమే నా ఊపిరి, నా పిలుపే ప్రభంజనం మొదలైనవి. మండలాధీశుడులో అన్నగారిని పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు చేయడం వల్ల అప్పట్లో ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదురుకుని కొన్నేళ్లు అవకాశాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. 30 ఇయర్స్ పృథ్విది అదే పరిస్థితి. ఒక సందర్భంగా విజయనిర్మల ఎదురుపడినప్పుడు ఎన్టీఆర్ గారే నేరుగా ఏమ్మా నా మీద సినిమాలు తీయడం అయిపోయిందా, ఇంకా ఉన్నాయా అంటూ నవ్వుతూ అడిగిన సందర్భం ప్రత్యక్ష సాక్షుల ద్వారా మీడియాలోనే వచ్చింది.

ఇవన్నీ రాజకీయ అభిప్రాయభేదాలు ఒకరకమైన స్నేహపూర్వకమైన వాతావరణంలో జరిగినవి. వాటి పట్ల అవగాహన ఇప్పటి తరం అభిమానులకు తక్కువ. దాంతో పవన్ తెచ్చిన సంస్కారం టాపిక్ కాస్తా లోతైన విశ్లేషణ లేకుండానే వైరలవ్వడానికి దారి తీసింది. కృష్ణ, ఎన్టీఆరే కాదు సీనియర్ నటుల పట్ల పవన్ కళ్యాణ్ ఏనాడూ మాట తూలిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు ప్రత్యేకంగా అసలీ లోకంలో లేని వారి గురించి చులకన చేసేంత తప్పు చేయరు. ఎన్నికల వేడి విపరీతంగా ఉన్న తరుణంలో ప్రతిదీ భూతద్దంలో చూసే బ్యాచ్ పెరిగిపోతోంది. దాని పరిణామమే ఇదంతా అనుకోవాలి.