పారిజాత పర్వం రిపోర్ట్

కంటెంట్ తప్ప ఇంక దేన్నీ నమ్ముకోవడానికి వీల్లేని చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే గండంగా మారిన తరుణంలో పారిజాత పర్వం అంతో ఇంతో ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. సునీల్, హర్ష చెముడు లాంటి తెలిసిన క్యాస్టింగ్ తో పాటు యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ కు వచ్చిన చైతన్య రావు హీరోగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందింది. ఖచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకంతో ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేశారు. నిన్న బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ పోటీ ఉన్నప్పటికీ కాస్త దృష్టిలో ఉన్నది ఈ మూవీనే. వెరైటీ టైటిల్ తో వచ్చిన పారిజాత పర్వం ఎలా ఉందంటే.

డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్ లో కాళ్లరిగేలా తిరుగుతున్న చైతన్య(చైతన్య రావు)కు అవమానాలు తప్ప అవకాశాలు రావు. ఎందరు ఎగతాళి చేసినా స్నేహితుడు హర్ష(హర్ష చెముడు)నే హీరోగా పెట్టి తీయాలని కంకణం కట్టుకుంటాడు. భీమవరం నుంచి వచ్చి గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన బార్ శీను(సునీల్) బయోపిక్ ని ఎంచుకుంటాడు. డబ్బు కోసం ఓ నిర్మాత(శ్రీకాంత్ అయ్యంగార్)భార్యను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా శీనుతో పాటు ఇతర గ్యాంగులు రంగంలోకి దిగుతాయి. అయోమయం మొదలవుతుంది. చివరికి చైతన్య అనుకున్నది సాధించాడా లేదా అనేది స్టోరీ.

ఫస్ట్ హాఫ్ నుంచే విపరీతమైన సాగతీతతో పాటు అక్కర్లేని సన్నివేశాలతో దర్శకుడు సంతోష్ సహనానికి పెద్ద పరీక్ష పెడతాడు. ఆసక్తికరంగా ఉండాల్సిన స్క్రీన్ ప్లే నవ్వించని కామెడీతో విసిగిస్తుంది. పాత్రల తీరుతెన్నులు లాజిక్ కి దూరంగా చాలా సిల్లీగా అనిపిస్తాయి. దానికి తోడు అక్కడక్కడా నవ్వించిన హర్ష ఒకదశ దాటాక ఓవర్ అనిపించడం ముమ్మాటికీ క్యారెక్టరైజేషన్ లోపమే. సంగీతంతో సహా సాంకేతిక విభాగాలన్నీ గందరగోళం చేశాయి. సునీల్ ఒక్కడే కొంత ఊరట. కిడ్నాప్ డ్రామా తీయడం ఒక కళ. లేకపోతే ఆడియన్స్ ఇలాంటివి బ్రోచేవారెవరురా అనకుండా భరించేదెలాగరా అనేస్తారు.