బాబోయ్ మియా అనిపించిన మల్టీస్టారర్

కేవలం ట్రైలర్ తోనే ఒక బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీకి నెగిటివిటీ రావడం అరుదు. బడేమియా చోటేమియా విషయంలో అదే జరిగింది. అక్షయ్ కుమార్, టైగర్ శ్రోఫ్ లాంటి మాస్ హీరోలు ఉన్నప్పటికీ ప్రీ రిలీజ్ బజ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముందు ఏప్రిల్ 10 అనుకుని తర్వాత మనసు మార్చుకుని ఒక రోజు విడుదల వాయిదా వేయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. సరే అసలు కంటెంట్ బాగుంటే ఇవన్నీ ఎవరూ పట్టించుకోరు కానీ ఇంతకీ పెద్ద మియా చిన్న మియాలు కలిసి ఏం చేశారయ్యా అంటే చదివి చూడండి అర్థమైపోతుంది.

ఇండియన్ ఆర్మీలో పని చేసే ఫిరోజ్(అక్షయ్ కుమార్), రాకేష్(టైగర్ శ్రోఫ్) లు ప్రమాదరకమైన మిషన్ లు పూర్తి చేయడంలో సిద్ధహస్తులు. కొన్ని అనూహ్య పరిణామాల వల్ల ఇద్దరి ఉద్యోగాలు పోవడంతో ఎవరి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. అంతర్జాతీయ తీవ్రవాది కబీర్ (పృథ్విరాజ్ సుకుమారన్) మన దేశానికి సంబంధించిన ఒక విలువైన ఆయుధాన్ని దొంగలించి లండన్ తీసుకెళ్తాడు. దాన్ని తిరిగి తెచ్చే బాధ్యత అప్పగించడం కోసం మియాలను పిలుస్తారు. ఇద్దరూ కెప్టెన్ మిషా(మానుషీ చిల్లార్) ని వెంటబెట్టుకుని బయలుదేరతారు. తర్వాత జరిగేది ఊహించుకోవచ్చు.

దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ పాత చింతకాయ పచ్చడి కథను తీసుకుని అరిగిపోయిన రికార్డు లాంటి స్క్రీన్ ప్లేతో సహనానికి పరీక్ష పెడతాడు. మొదట్లో కొంత ఫన్ అనిపించినా యాక్షన్ డ్రామా మొదలయ్యాక ఏ సన్నివేశం ఎందుకు ఎలా వస్తుందో సామాన్య ప్రేక్షకుడు సైతం ఈజీగా ఊహించేలా కథనం సాగడం కంటెంట్ ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతుంది. భారీ బ్లాస్టులు, ఛేజులు, ఫైట్లు ఎంత గొప్పగా ఉన్నా వాటికి బలం చేకూర్చే ఎమోషన్, కనెక్షన్ రెండూ మిస్ అవ్వడంతో బడేమియా చోటేమియాలు ఇద్దరూ వద్దు మియా అనిపిస్తారు. బలం లేని ఉత్తుత్తి యాక్షన్ హంగామా ఇది.