అల్లు అర్జున్ కోసం అట్లీ స్కెచ్చులు

ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ పూర్తి చేయడంలో తలమునకలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నది అధికారికంగా ప్రకటించకపోయినా దర్శకుడు అట్లీకే ఓటేశాడన్నది రెండు వారాల క్రితమే లీకైన ఓపెన్ సీక్రెట్. ఇటీవలే ఒక మీటింగ్లో ఇద్దరూ స్టోరీ లైన్ గురించి డిస్కస్ చేసుకున్నారని, అయితే ఫైనల్ వెర్షన్ పట్ల బన్నీ అంతగా సంతృప్తి చెందకపోవడంతో మరోసారి టీమ్ తో కలిసి అట్లీ వర్క్ చేస్తున్నాడని చెన్నై అప్డేట్. విజయ్ షారుఖ్ ఖాన్ లతో ప్లాన్ చేసుకున్న మల్టీస్టారర్ ఇప్పట్లో సాధ్యమయ్యే ఛాన్స్ లేకపోవడంతో అట్లీ దీని మీద పట్టుదలగా ఉన్నాడు.

క్యాస్టింగ్ గురించి కూడా స్కెచ్చులు వేస్తున్నట్టు సమాచారం. హీరోయిన్లలో ఒకరిగా సమంతాని తీసుకోవాలని అట్లీ ప్రాధమికంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ కాంబోతో గతంలో తేరి వచ్చింది. అందులో చనిపోయే పాత్ర అయినా సరే సామ్ కి పెర్ఫార్మన్స్ పరంగా మంచి స్కోప్ దక్కింది. అయితే బన్నీ ఒప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. గతంలో అల్లు అర్జున్, సమంతాలు సన్ అఫ్ సత్యమూర్తిలో జోడిగా కనిపించి మెప్పించారు. పుష్ప 1 ది రైజ్ లో ఊ అంటావా పాటతో ఆడియన్స్ ని సామ్ ఊపేసిన సంగతి తెలిసిందే. సో ఈ కాంబో అంటే ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది.

ఇవన్నీ ఫైనల్ కావడానికి ఇంకో రెండు నెలలు పట్టొచ్చు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేయాలనేది అట్లీ ఆలోచన. దానికి బన్నీ సానుకూలంగానే ఉన్నాడట. ఇప్పటికే పుష్ప కోసం నాలుగేళ్ల కాలం ఖర్చయిపోయింది కాబట్టి ఇకపై స్పీడ్ పెంచాలనేది అల్లు అర్జున్ సంకల్పం. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, యానిమల్ పార్క్ పూర్తి చేసుకుని తన దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకో రెండేళ్లకు పైగా పడుతుంది కాబట్టి ఈలోగా అట్లీది పూర్తి చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్యాన్ ఇండియా మూవీ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. ఏమైనా ఇవన్నీ అంత తేలిగ్గా తేలే వ్యవహారాలా. టైం పడుతుంది.