సంక్రాంతికి సంబరాలు… ఏటిగట్టుకి సవాళ్లు  

గత ఏడాది విడుదల కావాల్సిన సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు కొత్త డేట్ ఫిక్స్ చేసుకుంది. 2027 జనవరి 12 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న మెగా 158 పండక్కి వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హఠాత్తుగా మేనల్లుడి ప్రకటన రావడం చూస్తుంటే చిరు నిర్ణయం మారిందేమోనని అభిమానులు అనుమాన పడుతున్నారు.

దానికి క్లారిటీ ఆగస్ట్ 22 వచ్చేస్తుంది కాబట్టి ఇంకో వారం రోజులు వెయిట్ చేయాలి. సరే రిలీజ్ కావడం సంతోషమే కానీ సంబరాల ఏటిగట్టు ముందు కొండలాంటి కాంపిటీషన్ స్వాగతం పలుకుతోంది. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి కాంబో ఆల్రెడీ దానికి అనుగుణంగా షూటింగ్ శరవేగంగా చేస్తోంది. ఇంకా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాకపోయినా రవితేజ – శ్రీవిష్ణు మల్టీస్టారర్ అప్పుడే రావొచ్చని మరో టాక్. శర్వానంద్ – శ్రీను వైట్ల జార్జ్ క్రిష్ నిన్నే జనవరి 12 డేట్ తీసుకుని చెప్పేసింది.

సంబరాల ఏటిగట్టు చాలా పెద్ద బడ్జెట్ తో తీసిన కెజిఎఫ్ తరహా పీరియాడిక్ డ్రామా. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత ఒక ప్రాంతంలో జరిగిన విధ్వంస కాండ ఆధారంగా తెరకెక్కించారు. వినోదం, కామెడీ పెద్దగా ఉండవు. సంక్రాంతికేమో జనాలు ఎక్కువగా ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటారు. కలిసుందాం రా, అల వైకుంఠపురములో నుంచి మొన్న మన శంకరవరప్రసాద్ గారు వరకు ఇది చాలాసార్లు ఋజువయ్యింది. సంబరాల ఏటిగట్టు ఈ సెంటిమెంట్ బ్రేక్ చేయాలి.

గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన మహాకాళి జనవరి రెండో వారంలో వచ్చే ప్లాన్ లో ఉంది. ఆయనతో తీవ్ర విభేదాలు ఉన్న హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డినే ఇప్పుడీ సంబరాల ఏటిగట్టుకి నిర్మాత. అంటే ధృవ స్టయల్ లో ముడిపెట్టి చూస్తే తలపడాలనే ఉద్దేశంతోనే ఇది సెట్ చేసుకున్నారేమో అని అనుమానం రాకమానదు. ఇక్కడితో అయిపోలేదు. బాలయ్య 111, రజనీకాంత్ ధృవన్ కూడా సంక్రాంతి వైపే చూస్తున్నాయి.