దిల్ రాజుకు ఇంకో జాక్ పాట్

అగ్ర నిర్మాత దిల్ రాజు టాలీవుడ్లో ప్రయాణం మొదలుపెట్టింది డిస్ట్రిబ్యూషన్ ద్వారా. అందులో వచ్చిన సంపాదనతోనే నిర్మాత అయ్యాడు. టాలీవుడ్లో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఎదిగాడు. మామూలు డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చిన నిర్మాతగా ఎదిగిన వాళ్లు తర్వాత పంపిణీని వదిలేస్తుంటారు. కానీ రాజు మాత్రం అలా కాదు. ఓవైపు పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తూనే అంతకంటే ఎక్కువ సంఖ్యలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు.

నైజాంలో ఆయన తర్వాత ఎంతోమంది డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చారు కానీ.. రాజులా సక్సెస్ కాలేకపోయారు. ప్రొడక్షన్ దశలోనే సినిమాల ఫలితాల్ని అంచనా వేసి ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి హక్కులు తీసుకోవడం.. వాటితో లాభాల పంట పండించుకోవడంలో రాజు తెలివే వేరు. కొన్ని సినిమాలు తేడా కొట్టినా చాలా వరకు ఆయనకు లాభాలే అందిస్తుంటాయి. అప్పుడప్పుడూ ఆయనకు మంచి జాక్‌పాట్స్ తగులుతుంటాయి.

గత ఏడాది నాని ‘దసరా’తో పాటు అనువాద చిత్రాలు జైలర్, యానిమల్ రాజుకు భారీ లాభాలు అందించాయి. ఇప్పుడు ‘డీజే టిల్లు’ రూపంలో ఆయనకు ఇంకా పెద్ద జాక్‌పాట్ తగిలినట్లుంది. ఇంతకుముందు ‘డీజే టిల్లు’ను నైజాంలో రిలీజ్ చేశాడు రాజు. అది ఫుల్ రన్లో రూ.7 కోట్లు వసూలు చేసింది.

అప్పట్లో ఆ సినిమా స్థాయికి ఇది చాలా పెద్ద నంబర్. నిర్మాత నాగవంశీ.. ‘టిల్లు స్క్వేర్’ నైజాం డిస్ట్రిబ్యూషన్‌కు అదే నంబర్ కోట్ చేస్తే రాజు మరో ఆలోచన లేకుండా ఆ రేటు ఇచ్చి సినిమా తీసుకున్నాడు. ఇప్పుడు చూస్తే ‘టిల్లు స్క్వేర్’ తొలి రోజే నైజాంలో ఐదారు కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది.

వీకెండ్లో నైజాం వరకే సినిమా రూ.20 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేస్తే ఆశ్చర్యం లేదు. ఫుల్ రన్లో రాజు రూ.15 కోట్లకు తక్కువ కాకుండా షేర్ అందుకోబోతున్నాడు. అంటే పెట్టుబడి మీద రెట్టింపును మించి ఆదాయం అన్నమాట. అన్నీ కలిసొస్తే ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చినా ఆశ్చర్యం లేదు.