పంజా దర్శకుడికి కండల వీరుడి షాక్

పవన్ కళ్యాణ్ తో పంజా తీసిన దర్శకుడు విష్ణువర్ధన్ గుర్తున్నాడా. ఆ సినిమా ఫ్లాప్ అయినా అభిమానులకు స్టైలిష్ మేకింగ్ పరంగా ఇతనంటే బాగా ఇష్టం. తమిళంలో బిల్లా లాంటి బ్లాక్ బస్టర్ తో వెలుగులోకి వచ్చిన ఈ యాక్షన్ డైరెక్టర్ గత ఏడాదే సల్మాన్ ఖాన్ తో భారీ బడ్జెట్ తో ది బుల్ ప్లాన్ చేసుకున్నారు. కరణ్ జోహార్ నిర్మాతగా ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేశారు. హీరోయిన్ గా సమంతాను తీసుకోవడం ఖాయమయ్యిందని ముంబై మీడియాలో వచ్చింది. ఇందులో ఆర్మీ ఆఫీసర్ వేషం కోసం కండల వీరుడు ప్రత్యేకంగా కసరత్తులు చేసి జుత్తుని కురచగా కత్తిరిచుకున్నాడు.

మొన్న దసరాకో దీపావళికో షూటింగ్ మొదలుపెట్టాలనుకున్నారు. కానీ వాయిదాల పర్వం కొనసాగుతూనే వస్తోంది. స్క్రిప్ట్, క్యాస్టింగ్, బడ్జెట్ ఇలా ఏవేవో కారణాలతో ముందుకు తీసుకెళ్లలేకపోయారు. దీంతో విసుగొచ్చిన సల్మాన్ ఖాన్ దీన్ని ఇక్కడితో ఆపేద్దామని నిర్మాతకు కబురు పంపినట్టు లేటెస్ట్ అప్డేట్. విధి ఈ మూవీని ఆపుతోందని బలవంతంగా తీస్తే ప్రతికూల ఫలితం వస్తుందని భావించి డ్రాప్ అయినట్టు సన్నిహితులతో అంటున్నాడట. దీని స్థానంలో అవే కాల్ షీట్లతో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ త్వరలో ప్రారంభం కానుంది.

విష్ణువర్షన్ కి ఇది పెద్ద షాకే. క్యాన్సిలైన విషయం ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ దాదాపు కన్ఫర్మే. బాలీవుడ్ లో జెండా పాతుదామని చూసిన ఈ క్రియేటివ్ దర్శకుడికి ఇది ఊహించని షాకే. ఎందుకంటే ఈయనతో చేసేందుకు తమిళంలో పెద్ద హీరోలు అంతగా ఆసక్తి కనపరచడం లేదు. ఒకప్పుడు సూపర్ హిట్లు ఇచ్చినా ఆ మేజిక్ ఆయనలో లేదని వాళ్ళ ఫీలింగ్. అందుకే గౌతమ్ మీనన్ చక్కగా నటనకు పరిమితమై వరుస ఆఫర్లతో యమా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు విష్ణువర్థన్ ఏం చేస్తాడో వేచి చూడాలి. కిక్ 2 కూడా లైన్ లో పెట్టిన సల్మాన్ ఖాన్ దానికి పూర్తిగా కొత్త కథను ఎంచుకున్నాడు.