సైంధవ్ విలన్ విడాకుల కథ సుఖాంతం

అనుకుంటాం కానీ స్టార్ హోదా ఉన్న నటీనటుల వ్యక్తిగత జీవితాలు అంతే అందంగా ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో ఆధిక శాతం హీరో హీరోయిన్లు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పడినవాళ్ళే. సైంధవ్ తో టాలీవుడ్ కు పరిచయమైన నవాజుద్దీన్ సిద్ధిక్ ఇదే కోవలోకి వస్తాడు. చిన్న సైడ్ ఆర్టిస్టుగా మొదలై టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగిన ఈ విలక్షణ నటుడు హీరోగానూ చేస్తుంటాడు. సైంధవ్ లో వెంకటేష్ తర్వాత ఎక్కువ పారితోషికం తీసుకుంది తనేనంటే ఆశ్చర్యం కలిగించినా అతని రేంజ్ గురించి తెలిసిన వాళ్ళు ఆశ్చర్యపోరు.

నవాజుద్దీన్ కి భార్య అలియాతో ఎప్పటి నుంచో పొసగడం లేదు. పద్నాలుగేళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట కొంత కాలం క్రితం కాపురాన్ని రచ్చకెక్కించుకుంది. తీవ్ర విభేదాలు వచ్చి కోర్టు దాకా వెళ్లారు. తన పరువు తీస్తోందంటూ నవాజుద్దీన్ ఆరోపణలు చేయగా, జీవితాన్ని నాశనం చేశాడని అలియా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఒకదశలో వీళ్ళ గొడవలు పతాక స్థాయికి చేరుకున్నాయి. తీరా చూస్తే ఇప్పుడు కలిసిపోయారట. ఇద్దరు పిల్లలు నవాజ్, షోరా పెద్దవుతున్నందున్న అన్నింటి స్వస్తి చెప్పి మానసిక ప్రశాంతత కోసం నిర్ణయం తీసుకున్నామని అలియా చెబుతోంది.

ఇదేదో ముందే చేసి ఉంటే ఇంటి గుట్టు బయట ప్రపంచానికి తెలిసేది కాదుగా. ఏదైతేనేం కలిసిపోవడం సంతోషమే. ఈ మధ్య కొంచెం స్పీడ్ తగ్గించిన నవాజుద్దీన్ సిద్ధిక్ పర్సనల్ లైఫ్ వల్లే కొన్ని మంచి అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందని సన్నిహితులు అంటుంటారు. సైంధవ్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే తెలుగుకు ఒక మంచి విలన్ దొరికేవాడు కానీ సంక్రాంతి బరిలో డిజాస్టర్ కావడంతో ఇప్పటికిప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లు తనను ఆప్షన్ గా పెట్టుకోవడం లేదు. సరైన బ్రేక్ ఇంకొక్కటి ఇక్కడ పడితే మనకో విలన్ కొరత తీరిపోతుంది. చూడాలి మరి ఎవరితో చేస్తాడో.