పట్టు వదలనంటున్న క్రియేటివ్ దర్శకుడు

ఒకప్పుడు నిన్నే పెళ్లాడతా, గులాబీ లాంటి బ్లాక్ బస్టర్స్ తో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఆ తర్వాత ఎన్నో మంచి సినిమాలిచ్చారు. కొత్తవాళ్లతో చందమామ లాంటి సూపర్ హిట్స్ ని అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే అంటే వెంటనే గుర్తొచ్చే వాటిలో ఖడ్గం ముందు వరసలో ఉంటుంది. సిందూరంని మెచ్చుకోని విమర్శకులు లేరు. ఇదంతా గతం. ప్రస్తుతం కృష్ణవంశీ బ్యాడ్ ఫామ్ గురించి తెలిసిందే. గత ఏడాది ప్రకాష్ రాజ్ తో తీసిన రంగమార్తాండ మెప్పులు తెచ్చింది కానీ నిర్మాతకు కాసులు తేలేదు.

ఒకరకంగా చెప్పాలంటే ఇంత వెనుకబడి ఉన్న సీనియర్ దర్శకులు సాధారణంగా రిస్కులు చేయరు. కానీ ఈయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా కథలు రాసుకుంటూనే ఉన్నారు. తాజాగా మూడు జంటలతో ఓ ప్రేమకథను ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. డెబ్యూ యాక్టర్స్ ని తీసుకుని తక్కువ బడ్జెట్ తో ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీని చెప్పే ప్రయత్నం చేస్తారట. మూడు దశాబ్దాల క్రితం గులాబీలో యూత్ పల్స్ ని సరిగ్గా పట్టుకున్న కృష్ణవంశీ ఇంత లేట్ ఏజ్ లో అందులోనూ మారిన ట్రెండ్ కు అనుగుణంగా మెప్పిస్తారా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న.

దీనికి సమాధానం తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. కృష్ణవంశీ అనే కాదు బి గోపాల్, వివి వినాయక్, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు లాంటి సీనియర్లు ఇప్పటి జనరేషన్ కు అనుగుణంగా స్క్రిప్ట్ ల విషయంలో తడబడి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. స్టార్ హీరోలు అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేని దాఖలాలు బోలెడు. రామ్ చరణ్ కోరిమరీ గోవిందుడు అందరివాడే చేస్తే ఏమయ్యిందో అభిమానుల కన్నా ఎక్కువగా కృష్ణవంశీకే తెలుసు. మరి ఇప్పుడు ఇది చివరి బంతిగా భావించి సిక్సర్ కొడతారో లేదో బాక్సాఫీసే సమాధానం చెప్పాలి.