సోనూ సూద్ స్కాలర్ షిప్ రెడీ


లాక్ డౌన్ టైంలో ఇండియాలో జరిగిన అతి మంచి విషయం అంటే.. సోనూ సూద్ సేవే. వలస కార్మికులను ఆదుకోవడంతో మొదలుపెట్టి అతను ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశాడు. అతను ఏ ప్రయోజనం ఆశించకుండా తన ఆత్మ సంతృప్తి కోసమే ఇలా చేస్తున్నాడని స్పష్టమైంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే రావచ్చేమో. కానీ ఇప్పుడు మాత్రం సోనూ పరిమితులేమీ పెట్టుకోకుండా సేవా కార్యక్రమాల్ని విస్తరిస్తున్నాడు.

ఐతే తనను సాయం అడిగిన ఒక్కో వ్యక్తికి అండగా నిలవడంతో పాటు దీర్ఘ కాలిక లక్ష్యాలతో అతను గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుండటం విశేషం. ఓవైపు పేద విద్యార్థులకు ఉపకార వేతనం అందించడంతో పాటు ఉద్యోగం చూస్తున్న మధ్య తరగతి యువత కోసం ఒక కన్సల్టన్సీ లాంటిది ఏర్పాటు చేసి లక్షల్లో ఉద్యోగాలు కల్పించడానికి అతను ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా సోనూ ముందుగా ఉపకార వేతన పథకాన్ని మొదలుపెట్టాడు. ఉన్నత విద్య చదివే స్థోమత లేక తోడ్పాటు కోసం చూస్తున్న విద్యార్థులకు అతను ఆదుకోనున్నాడు. ఇందుకు అర్హత కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు లోపు ఉండాలి. విద్యార్థులు అంతకుముందు పూర్తి చేసిన తరగతిలో మంచి మార్కులు సాధించి ఉండాలి. ఇవి రెండూ ఉన్న వారికి సోనూ సూద్ నుంచి ఉపకార వేతనం అందుతుంది.

ఇలాంటి విద్యార్థులకు కోర్సు ఫీజు, వసతి, ఆహారం అన్నీ సోనూ సంస్థే చూసుకుంటుంది. మెడిసన్, ఇంజినీరింగ్, రోబోటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ స్టడీస్, జర్నలిజమ్ మొదలైన వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారందరూ దీనికి అర్హులేనని సోనూ ప్రకటించాడు. దీనికి అప్లై చేసుకోవాలనుకునే వారు scholarships@sonusood.me మెయిల్‌కు పది రోజుల్లో తమ వివరాలను పంపించాలని సోనూ కోరాడు. ఈ ఉపకార వేతన పథకానికి సంబంధించి దేశంలోనే అనేక యూనివర్శిటీలతోనూ సోనూ ఒప్పందం చేసుకోవడం విశేషం. త్వరలో ఉద్యోగాల కల్పన పథకాన్ని కూడా సోనూ మొదలుపెట్టనున్నాడు.