ముచ్చటగా మూడోసారి దువ్వాడ జోడి

హీరోయిన్ పూజా హెగ్డేకు కెరీర్ ప్రారంభంలో వరస ఫ్లాపులు ఉన్నప్పుడు తనకు ఆక్సిజన్ లా పని చేసింది డీజే దువ్వాడ జగన్నాథం సినిమానే. అల్లు అర్జున్ సరసన జోడి కట్టడం ఒక్కసారిగా దశను మార్చేసింది. అదేమీ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా మంచి విజయం నమోదు చేసుకుని పూజా టాలెంట్ ని ఎలా వాడుకోవాలో దర్శకుడు హరీష్ శంకర్ రూపంలో చూపించింది. దీనికన్నా మెరుగ్గా త్రివిక్రమ్ అల వైకుంఠపురములో ఈ ఇద్దరు చేసిన సందడిని ప్రేక్షకులు మర్చిపోలేరు. తాజాగా ముచ్చటగా మూడో సారి ఈ దువ్వాడ జట్టు కట్టే ఛాన్స్ ఉందని చెన్నై టాక్.

అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోయే ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన లీక్ ఆల్రెడీ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నిన్న తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ డిస్కషన్ చేస్తున్న దర్శకుడు అట్లీ వీడియోని ఆయన భార్య ప్రియా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ అయ్యింది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేనే అనుకుంటున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసుకోలేదు కానీ దాదాపు ఓకే అవ్వొచ్చట. ప్రస్తుతం బుట్ట బొమ్మ చేతిలో ఆహన్ శెట్టి హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ మాత్రమే ఉంది. అది కూడా షూటింగ్ కీలక దశలో ఉంది.

వేసవికంతా ఈ సినిమా పూర్తయిపోతే ఆ తర్వాత ఫ్రీనే. ప్రస్తుతం అమ్మడు ఫామ్ లో లేకపోయినా అట్లీ ఆ లెక్కలేమి వేసుకోవడం లేదట. కమర్షియల్ గా హీరోయిజంని పీక్స్ లో చూపించే ఇతను హీరోయిన్ కు ప్రాధాన్యం ఇస్తాడు కానీ ప్రత్యేకంగా డిమాండ్ లో ఉన్న వాళ్ళ కోసమే చూడడు. తేరిలో అమీ జాక్సన్ ని తీసుకోవడానికి కారణం ఇదే. కాకపోతే ఇక్కడ బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం ఉంటుందని అంటున్నారు కానీ అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ ఉండొచ్చట.