హనుమాన్ రాకకై డిజిటల్ ఫ్యాన్స్ ఎదురుచూపులు

ఇప్పుడంతా ఓటిటి యుగం. ఒక సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే డిజిటల్ లో చూసేందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న కాలం. ఒకప్పుడు ఈ వెయిటింగ్ శాటిలైట్ ఛానల్స్ ప్రీమియర్లకు ఉండేది కానీ క్రమంగా ఈ స్థానాన్ని అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటివి ఆక్రమించుకోవడం మొదలుపెట్టాయి. కరోనా తర్వాత ఈ ట్రెండ్ ఉదృతంగా మారింది. అందుకే దానికి తగ్గట్టే నిర్మాతలు కూడా వీలైనంత తక్కువ గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, గుంటూరు కారం కేవలం 28 రోజులకే స్మార్ట్ స్క్రీన్ మీద ప్రత్యక్షం కావడం చూస్తూనే ఉన్నాం.

అదేం విచిత్రమో హనుమాన్ డెబ్భై రోజులు దాటేస్తున్నా ఇప్పటిదాకా ఓటిటి మోక్షం దక్కలేదు. ఒకపక్క 16న హిందీ వెర్షన్ ని కలర్స్ ఛానల్ తో జియో సినిమాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు హక్కులు సొంతం చేసుకున్న జీ5 మాత్రం సైలెంట్ గా ఉంది. ఒక రోజు ముందు మార్చి 15 రావొచ్చనే టాక్ ఉన్నప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి సౌండ్ ఇప్పటికైతే లేదు. నిన్న ప్రశాంత్ వర్మ కాసేపట్లో ఓటిటి అనౌన్స్ మెంట్ ఉంటుందని ట్వీట్ చేసి ఇరవై నాలుగు గంటలు దాటినా ఎలాంటి అప్డేట్ లేకపోవడం ఫ్యాన్స్ ని అసహనానికి గురి చేయడంలో ఆశ్చర్యం లేదు.

ఏది ఏమైనా ఇలాంటివి కనీసం అర్ధ శతదినోత్సవం కాగానే ఓటిటిలో వస్తే మిలియన్ల వ్యూస్ వెల్లువలా వచ్చి పడాయి. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లు సైతం ఇంత టైం తీసుకోలేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ మొన్న సంక్రాంతి విజేతగా నిలవడమే కాదు తొంభై రెండేళ్ల టాలీవుడ్ చరిత్రలో ఎన్నో రికార్డులు వశం చేసుకుంది. సహజంగానే ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి తక్కువ గ్యాప్ కే ముందు ఒప్పందం చేసుకున్నారని, థియేటర్ రన్ చూశాక పొడిగించుకుంటూ పోవడంతో ఇంత ఆలస్యమైయ్యిందని ఓటిటి టాక్. ఇకనైనా మోక్షం కలిగిస్తే బెటర్.