స్టార్ హీరో సినిమా ఫుటేజి మాయమయ్యిందట

చూసిన కాసిన్ని జనాలు మర్చిపోయారు కానీ దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ మాత్రం లాల్ సలామ్ పరాజయంలో తన తప్పు తక్కువని చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం విని అభిమానుల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అదేంటంటే ఈ సినిమాకు సంబంధించిన 21 రోజులు షూట్ చేసిన ఫుటేజ్ మాయమైపోయింది. 10 కెమెరాలు వాడి షూట్ చేసిన క్రికెట్ మ్యాచ్ తాలూకు వీడియో కూడా హార్డ్ డిస్క్ లో తలెత్తిన సమస్య వల్ల కరప్ట్ అయిపోయింది. దీంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొని టీమ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యింది.

ఇది గుర్తించేలోపే రజనీకాంత్ తో సహా విష్ణు విశాల్ తదితర ఆర్టిస్టుల వేరే సినిమాల కోసం మేకోవర్ మార్చుకున్నారు. పైగా విడుదల తేదీని అప్పటికీ ప్రకటించి ఉండటంతో డిస్ట్రిబ్యూటర్ల వద్ద మళ్ళీ మాట వస్తుందనే కారణంతో హడావిడిగా ఎడిటింగ్ చేయడంతో ఫైనల్ అవుట్ ఫుట్ గందరగోళంగా మారిపోయింది. ఈ కారణంగా స్క్రీన్ ప్లే కన్ఫ్యుజింగ్ గా మారిపోయి ఆడియన్స్ కి చిరాకు వచ్చేసింది. ఆఖరికి తండ్రి కనిపించే ఎపిసోడ్లను సైతం కనీస స్థాయిలో మెప్పించేలా ఐశ్వర్య చేయలేకపోయింది. దీంతో కోలీవుడ్ చరిత్రలో అతి పెద్ద డిజాస్టర్స్ లో లాల్ సలామ్ కు చోటు దక్కేలా చేసింది.

ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. ఎప్పుడైనా సరే నిర్లక్ష్యం పనికి రాదు. లైకా లాంటి పెద్ద నిర్మాణ సంస్థలోనే ఇలా జరగడం అనూహ్యం. ఫెయిల్యూర్ ని ఇంతగా ఒప్పుకుంటున్న ఐశ్వర్య వేరొకరికి ఉదాహరణగా నిలుస్తోంది. ఈ నెలలోనే ఓటిటి ప్రీమియర్ జరుపుకోనున్న లాల్ సలామ్ ఆన్ లైన్ లో ఏ స్థాయి ట్రోలింగ్ ఎదురుకుంటుందో చూడాలి. ఎందుకంటే టాక్ విని రివ్యూలు చదివి థియేటర్ దరిదాపులోకి వెళ్లని ప్రేక్షకులు భారీగా ఉన్నారు. వాళ్ళందరూ ఆటోమేటిక్ గా డిజిటల్ షోలు వేసుకుంటారు. అప్పుడు ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.