మమితకు ఇంతకన్నా ఏం కావాలి

దక్షిణాదిలోనే కాదు మొత్తం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే ఠక్కున చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి. అలాంటి లెజెండరీ ఫిలిం మేకర్ తో పొగిడించుకోవడమంటే మాటలా. ప్రేమలు హీరోయిన్ మమిత బైజు ఇప్పుడీ ఆనందాన్ని మాటల్లో కొలవలేనంత గొప్పగా ఆస్వాదిస్తోంది. నిన్న జరిగిన ప్రేమలు సక్సెస్ మీట్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన జక్కన్న మమిత మీద ప్రశంసలు కురిపిస్తూ గీతాంజలి గిరిజ, సాయిపల్లవితో పోలుస్తూ వాళ్ళ స్థాయికి చేరుకుంటావని మెచ్చుకోవడం చూస్తే ఆ అమ్మాయికి నోరు పెగలడం కష్టమేగా. నిన్న ఈవెంట్ లో జరిగింది అదే మరి.

మలయాళం మేకర్స్ ఈర్ష్య పడే స్థాయిలో యాక్టర్స్ ని తయారు చేస్తున్నారని చెప్పిన రాజమౌళి యాక్షన్ ని ఇష్టపడే తాను ప్రేమకథలు, రామ్ కామ్ లు అంతగా చూడనని, ప్రేమలు మొదటి పదిహేను నిముషాలు మినహాయించి తర్వాత నవ్వుతూనే ఉన్నానని ఇంత గొప్పగా తీసినందుకు దర్శకుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చారు. నిర్మాత కార్తికేయ కాబట్టి రాజమౌళి రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఇంత డిటైల్డ్ గా దాని గురించి మాట్లాడ్డం మాత్రం విశేషమే. ఎలాంటి అంచనాలు లేకుండా మొదలుపెట్టి చివరికి చాలా సంతోషంగా ఫీలయ్యానని చెప్పారు.

బాక్సాఫీస్ వద్ద మెల్లగా మొదలైన ప్రేమలు క్రమంగా పుంజుకుంటోంది. అనూహ్యంగా గామి నెమ్మదించగా ఇప్పుడీ యూత్ స్టోరీకి ఆడియన్స్ పెరుగుతున్నారు. ఈ శుక్రవారం ఏడెనిమిది కొత్త రిలీజులు ఉన్న నేపథ్యంలో ప్రేమలు టీమ్ ప్రమోషన్ స్పీడ్ పెంచింది. రాబోయే వీకెండ్ కి మంచి ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునేందుకు పబ్లిసిటీని ప్లాన్ చేసుకుంటోంది. రాజమౌళి ప్రోత్సాహం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. స్వయంగా మహేష్ బాబు ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా హైప్ ప్రేమలు వైపు మళ్లుతోంది. బ్రేక్ ఈవెన్ అయిపోయింది కాబట్టి లాభాలు ఎంతొస్తాయో చూడాలి.