కేంద్రమంత్రితో అలా మాట్లాడటం కంగనాకే చెల్లుతుందేమో?

ఆయనో కేంద్రమంత్రి. ఆమె ఒక సినీ నటి. వ్యక్తిగతంగా ఎంతటి స్నేహం ఉన్నా.. అత్యున్నత స్థానాల్లో ఉండేవారి విషయంలో వ్యవహరించే తీరు అంటూ ఒకటి ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించే కంగనా తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. తన మనసులోని అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా.. సూటిగా ప్రశ్నించేతత్త్వం నటి కంగనాలో ఎక్కువే. అందుకే ఆమెను పలువరు ఫైర్ బ్రాండ్ గా అభివర్ణిస్తుంటారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఎపిసోడ్ లో కొమ్ములు తిరిగిన బాలీవుడ్ హీరోలు సైతం మౌనంగా ఉంటే.. కంగనా మాత్రం అందుకు భిన్నంగా శివసేన సర్కారుపై తనకు నమ్మకం లేదని.. కేసు విచారణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటా.. మాటా పెరిగి చివరకు కంగనా కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ పాక్షికంగా కూల్చేశారు.
కూల్చివేతను బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)ని గూండారాజ్యంతో పోల్చారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ముంబయిలో ఉన్న ఆమెను కేంద్రమంత్రి అధావలె భేటీ అయ్యారు. ఆమెతో మాట్లాడారు. జరుగుతున్న పరిణామాలపై వారి మధ్య చర్చ సాగినట్లుగా చెబుతున్నారు. కేంద్రమంత్రి తన ఇంటికి వచ్చిన సందర్భంగా కంగనా కూర్చున్న తీరు సబబు గా లేదన్న మాట పలువురి నోటి నుంచి వస్తుంది. ఒక కేంద్రమంత్రితో మాట్లాడే వారు కాస్తంత అయితే.. పద్దతిగా వ్యవహరిస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది. కేంద్రమంత్రి స్థానే ప్రధాని వచ్చారే అనుకోండి.. అప్పుడు కూడా అలానే మాట్లాడతారా? అని ప్రశ్నిస్తున్నారు.

వ్యక్తులతో ఉండే స్నేహాన్ని వ్యక్తిగతానికి పరిమితం చేయాలని.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారితో భేటీ అయిన సందర్భంగా పబ్లిక్ లోకి పంపే ఫోటోల విషయంలోనూ ఇలానా? అన్నఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రీల్ క్వీన్ ఇమేజ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో కంగనా వ్యవహరశైలి ఉందంటున్నారు. సోఫాలో కాళ్లను పైకి పెట్టేసుకొని.. ఓ పక్కగా వాలి మాట్లాడుతున్న తీరు చూసినప్పుడు..కంగనా వ్యవహారశైలిని తప్పు పడుతున్నారు.