జీవిత మౌనానికి కారణం?


తెలుగులో ఒకప్పుడు తనదైన ముద్ర వేసిన అచ్చ తెలుగు హీరోయిన్లలో జీవిత ఒకరు. 80వ దశకంలో ఆమె చేసిన అనేక సినిమాలు మంచి విజయం సాధించాయి. ‘అంకుశం’ సినిమా చేస్తూ రాజశేఖర్‌తో ప్రేమలో పడిన ఆమె కొంత కాలానికి ఆయన్ని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడింది. ఆ తర్వాత నటనకు దూరం అయిన ఆమె.. తర్వాత ప్రొడక్షన్, డైరెక్షన్లో భాగమైంది. సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాల్లో రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరించింది.

ఐతే ఔట్ స్పోకెన్ అయిన జీవిత చుట్టూ కొన్ని వివాదాలు కూడా ముసురుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకు చుట్టుకుని కోర్టు జైలు శిక్ష విధించే వరకు వెళ్లింది. ఈ కేసు నుంచి ఎలాగోలా బయటపడ్డ జీవిత.. కొన్నాళ్లుగా అస్సలు మీడియాలో కనిపించడం లేదు.

తాను ఉద్దేశపూర్వకంగానే దేని గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తున్నట్లు జీవిత ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇది తన కూతుళ్ల కెరీర్ల కోసమే అని ఆమె వెల్లడించింది. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు దాటింది. ఎన్నో ఒడుదొడుకులను దాటి ఒక స్థాయికి చేరుకున్నా. నేను ఏదైనా ఉన్నదున్నట్లు మాట్లాడేస్తాను. అది అందరికీ నచ్చదు. అందుకే ఎక్కువ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. మనం అన్నింటి మీదా స్పందించనంత మాత్రాన ప్రపంచం ఆగిపోదు కదా అనిపించింది.

ఇప్పుడు నా పిల్లలు ఇండస్ట్రీలోకి వచ్చారు. నేనేదైనా మాట్లాడి వివాదాస్పదం అయితే అది వాళ్ల కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అనిపించింది. అందుకే మా కారణంగా వాళ్లు ఇబ్బంది పడకూడదని నాతో పాటు మా ఆయన కూడా మౌనంగా ఉంటున్నాం. కానీ అది భయం కాదు. మేమిప్పుడు హాయిగా ఉన్నాం’’ అని జీవిత చెప్పింది. జీవిత చాలా ఏళ్ల తర్వాత ఇటీవలే రజినీకాంత్ సినిమా ‘లాల్ సలాం’తో నటిగా రీఎంట్రీ ఇచ్చింది.