వ్యూహం రిలీజ్ అయ్యిందహో

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఒక ప్రాపగండా సినిమా తీసి.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి మీద బురదజల్లే ప్రయత్నం చేశాడు సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆ చిత్రం వైసీపీకి నిజంగా కలిసి వచ్చిందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఐతే వైసీపీ మాత్రం ఆ నమ్మకంతోనే ఈసారి ఆయనకు మరింత ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇచ్చి ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలు తీయించిందన్న విషయం బహిరంగ రహస్యమే.

ఐతే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌లను మరింతగా టార్గెట్ చేస్తూ వర్మ తీసిన ఈ సినిమాలకు కోర్టు కేసుల రూపంలో అడ్డంకులు ఎదురవడం.. వాయిదాల మీద వాయిదాలు పడడం తెలిసిందే. ఈ అడ్డంకులు తొలగిపోయాక కూడా ఫిబ్రవరి 23కు వ్యూహంను షెడ్యూల్ చేసి, చివరి నిమిషంలో వాయిదా వేశాడు వర్మ.

ఇక వర్మ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా లేదా అనుకుంటుండగా.. మార్చి 2కు ‘వ్యూహం’ కోసం కొత్త డేట్ ఇచ్చిన వర్మ.. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగలిగాడు. ఈ వీకెండ్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’; ‘చారి 111’, ‘భూతద్దం భాస్కర నారాయణ’ చిత్రాలు ఆల్రెడీ విడుదల కాగా.. తర్వాతి రోజు చడీ చప్పుడు లేకుండా థియేటర్లలోకి దిగింది ‘వ్యూహం’.

ఐతే వర్మ అంచనా వేసినట్లు టీడీపీ, జనసేన వాళ్లు ఈ సినిమా కోసం ఎగబడడం లాంటిదేమీ జరగలేదు. వాళ్లు అసలు ఈ సినిమాను పట్టించుకోనే లేదు. పోనీ వైసీపీ వాళ్లయినా ఓన్ చేసుకున్నారా అంటే అదీ జరగలేదు. ఈ సినిమా గురించి అసలు ఎక్కడా డిస్కషనే లేదు. ‘వ్యూహం’ రిలీజైన సంగతి కూడా సామాన్య జనాలకు తెలియని పరిస్థితి. రిలీజైన చోటల్లా థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సినిమా చూసిన వాళ్లు కూడా మరీ నాసిరకంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.